పోలీస్ శాఖలో కొత్త కొలువులు.. 15 వేల నియామకాల భర్తీకి కసరత్తు
హైదరాబాద్ : తెలంగాణలో మరోసారి పోలీస్ కొలువుల జాతర షురూ కానుంది. ఈసారి కూడా భారీ స్థాయిలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఆ మేరకు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కసరత్తు చేస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే త్వరలోనే ఉద్యోగ ప్రకటన విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది.
పోలీస్ శాఖలో 15 వేల పోస్టుల భర్తీ ప్రక్రియకు లైన్ క్లియరైంది. పోలీస్ శాఖలో త్వరలోనే భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ ఉండబోతోందని సీనియర్ ఐపీఎస్ అధికారి ఒకరు వ్యాఖ్యానించడం దానికి బలం చేకూరుస్తోంది. గతేడాది నోటిఫికేషన్కు సంబంధించి కూడా నియామక ప్రక్రియ జోరందుకుంది.
వీఆర్ఏను చెప్పుతో కొట్టిన మహిళా రైతు.. కేసీఆర్, కేటీఆర్ వ్యాఖ్యలే ఆదర్శమా..! (వీడియో)
కొలువుల జాతర.. త్వరలో నోటిఫికేషన్..!
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. త్వరలోనే పోలీసుశాఖలో మరో 15 వేల పోస్టులు భర్తీ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఆ దిశగా నోటిఫికేషన్ మొదలు నియామక ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (TSLPRB) కసరత్తు చేస్తోంది. మరోవైపు గతేడాది జారీ చేసిన నోటిఫికేషన్ కు సంబంధించి పోలీస్ నియామక ప్రక్రియను స్పీడప్ చేసింది.
దానికి సంబంధించి ఫైనల్ స్టేజీ కూడా పూర్తయింది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా పూర్తయింది. త్వరలోనే కటాఫ్ మార్కులు ప్రకటించనుంది బోర్డు. తద్వారా అభ్యర్థుల తుది ఎంపిక ప్రక్రియ చేపట్టే పనిలో బిజీగా ఉంది. అది కూడా పూర్తయితే పోలీస్ శాఖలోకి కొత్తగా 18 వేల 500 మంది కొత్తగా విధుల్లో చేరనున్నారు. అందులో 17 వేల 156 మంది కానిస్టేబుల్స్ కాగా మరో వేయి 275 మంది ఎస్సైలు ఉండనున్నారు.
ఈసారి కొత్త జిల్లాల ప్రాతిపదికనా?
2018, మే నెలలో విడుదలైన నోటిఫికేషన్ కోసం పాత జిల్లాలను ప్రాతిపదికగా తీసుకున్నారు. ఆ మేరకు ఖాళీలను భర్తీ చేయనున్నారు. అప్పటి 18 వేల 500 పోస్టుల భర్తీ ప్రక్రియ ముగిశాక మరోసారి సివిల్, ఏఆర్, ఎస్పీఎఫ్ తదితర విభాగాల్లో కొత్త జిల్లాల వారీగా ఖాళీలను గుర్తించనున్నారు. అయితే ఈసారి వెలువడనున్న నోటిఫికేషన్ లో మాత్రం.. 33 కొత్త జిల్లాల ప్రాతిపదికన పోస్టులను భర్తీ చేయాలనేది అధికారుల అంతరంగంగా కనిపిస్తోంది.
నోటిఫికేషన్ కోసం అంతా సిద్ధం చేసేలోగా కొత్త జిల్లాలకు రాష్ట్రపతి ఆమోదం లభిస్తుందనేది పోలీస్ శాఖ ఉన్నతాధికారుల ఆలోచన. ఆ మేరకు 15 వేల ఖాళీల భర్తీకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొదలుపెట్టనున్నారు. అందులో 14 వేల కానిస్టేబుళ్లతో పాటు మరో వేయి వరకు ఎస్సై పోస్టులు ఉంటాయనే టాక్ వినిపిస్తోంది.
సిబ్బంది కొరతకు బ్రేక్.. వీక్లీ ఆఫ్ సాధ్యమయ్యేనా?
ఇప్పటివరకు పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్నవారు దాదాపు 54 వేల మంది మాత్రమే ఉన్నారు. అందులో 32 వేల మంది సివిల్ పోలీసులు కాగా.. 14 వేల మంది ఏఆర్ పోలీసులు.. 8 వేల మంది వరకు టీఎస్ఎస్పీ సిబ్బంది ఉన్నారు. అయితే శాంతిభద్రతలు గానీ ఇతరత్రా అవసరాలకు గాను ఈ సంఖ్య నామమాత్రమనేది బహిరంగ రహస్యం.
సరైన సంఖ్యలో సిబ్బంది లేక పోలీస్ శాఖ సతమతమవుతోంది. సిబ్బంది కొరత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అయితే గతేడాది నోటిఫికేషన్ ప్రకారం పోలీస్ శాఖలో కొత్తగా మరో 18 వేల 500 మంది చేరితో కొంతలో కొంత ఊరట లభించనుంది. దానికి తోడు కొత్తగా మరో 15 వేల ఖాళీలను భర్తీ చేస్తే పోలీస్ శాఖకు మరింత ఉపశమనం కలగనుంది. అంతేకాదు పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు చేయాలనే సంకల్పం కూడా ఈజీ కానుంది.