అవి మామూలు కళ్లు కాదు.. 110 స్పీడైనా దొరకాల్సిందే..!
ఉప్పల్ : నేరాల నియంత్రణకు తెలంగాణ పోలీసులు అత్యాధునిక టెక్నాలజీ వాడుతున్నారు. ప్రజల భద్రత కోసం అవసరమైన అన్నీ చర్యలు తీసుకుంటున్నారు. ఆ క్రమంలో ఘట్ కేసర్ ఐటీ కారిడార్ లో మరింత భద్రత పెంచేలా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఏకకాలంలో మూడు వందలకు పైగా సీసీ కెమెరాల విజువల్స్ ను వాల్ స్క్రీన్ పై చూసే అవకాశముంది.
భద్రత.. మరింత పదిలం
భద్రత విషయంలో కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యం తీసుకుంటున్నారు రాచకొండ పోలీసులు. ఆ క్రమంలో నయా టెక్నాలజీ సీసీ కెమెరాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. 24x7 భద్రత కోసం జర్మనీ టెక్నాలజీ మోబో టిక్స్ కెమెరాలను వినియోగించనున్నారు. వేగంతో దూసుకెళ్లే వాహనాలను దృశ్యరూపంలో బంధించేలా ఈ టెక్నాలజీ ఉపయోగపడనుంది. 110 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే వాహనాలను సైతం స్పష్టంగా చిత్రీకరించడం ఈ కెమెరాల స్పెషాలిటీ. సెకనుకు 120 ఫ్రేమ్స్ తీసే సామర్థమున్న మోబో టిక్స్ కెమెరాలు.. వరంగల్ జాతీయ రహదారిపై దాదాపు 23 కిలోమీటర్ల దూరాన్ని ప్రతిక్షణం వీక్షించనున్నాయి.
ఉప్పల్ జంక్షన్ నుంచి కేపాల్ వరకు మోబో టిక్స్ కెమెరాలు దాదాపు 182 అమర్చారు. కమ్యూనిటీ పోలీసింగ్ - కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యత కింద ఇన్ఫోసిస్ సంస్థ దాదాపు 5 కోట్ల రూపాయలు వెచ్చించింది. రాచకొండ పోలీసుల భాగస్వామ్యంతో ఈ కెమెరాలను ఏర్పాటు చేసింది.
ఐటీ కారిడార్.. కమాండ్ కంట్రోల్
ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ భవనం నిర్మించారు. ఇక్కడి నుంచి ప్రస్తుతం 382 సీసీ కెమెరాల ఫ్రేములను తిలకించేందుకు వాల్ స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఘట్ కేసర్ ఐటీ కారిడార్ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో.. ఈ సరికొత్త కెమెరాలతో భద్రత మరింత పటిష్టం కానుంది. అంతేకాదు వేగంగా దూసుకెళుతూ ప్రమాదాలకు కారణమవుతున్న వాహనాలను సులువుగా గుర్తించడానికి వీలవుతుంది.
ఇన్ఫోసిస్ భాగస్వామ్యం
ఘట్ కేసర్ కమాండ్ కంట్రోల్ రూమ్ కు సీసీ కెమెరాలను అనుసంధానించే సంఖ్య మరింత పెరగనుంది. ఈ కంట్రోల్ రూములో పోలీస్ ఐటీ కారిడార్ ఆఫీసుతో పాటు షీ టీమ్స్ కార్యాలయం ఏర్పాటుచేశారు. సోమవారం (25.02.2019) నాడు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్మన్ సుధా నారాయణమూర్తి, సీపీ మహేశ్ భగవత్, అదనపు డీసీపీ జితేందర్ ప్రారంభించనున్నారు.
త్వరలోనే బంజారాహిల్స్ లో ప్రధాన కమాండ్ కంట్రోల్ ప్రారంభించనున్నారు. అనంతరం ఘట్ కేసర్ కమాండ్ కంట్రోల్ రూమును దానికి అనుసందానించనున్నారు.