8 మంది టీఆర్ఎస్ నేతలు జంపా.. అమిత్ షా సమక్షంలో కాషాయం కండువా.. అందులో నిజమెంత?
Recommended Video
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీలో ఇంకా అసమ్మతి చల్లారేదా? అసలు పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుతోంది? మంత్రి వర్గ విస్తరణ నేపథ్యంలో చెలరేగిన అసంతృప్తి జ్వాలలు ఇంకా ఎగిసిపడుతూనే ఉన్నాయా? కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గానీ, నేతలు గానీ బీజేపీ వైపు చూస్తున్నారా? ఇలాంటి ప్రశ్నలకు తాజా పరిణామాలు కొంతలో కొంత అవుననే సమాధానం ఇస్తున్నాయి. అయితే ఆ ఎనిమిది మంది నేతలు అమిత్ షా సమక్షంలో కమల తీర్థం పుచ్చుకోనున్నారనే ప్రచారం మరింత హాట్ టాపికైంది. అదలావుంటే అసంతృప్త నేతలు మళ్లీ గొంతు సవరించుకుని కేసీఆర్కే జై కొడుతున్న నేపథ్యంలో ఆ వార్త ఎంతవరకు నిజమన్నది ప్రశ్నార్థకంగా మారింది.
రసవత్తరంగా తెలంగాణ రాజకీయాలు
తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. లోక్సభ ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకుని రాష్ట్రంలో బీజేపీ జెండా మరింత రెపరెపలాడాలని ఆ పార్టీ నేతలు క్షేత్ర స్థాయిలో పావులు కదుపుతున్నారు. అధిక సభ్యత్వ నమోదుతో మరింత జోష్ పెరిగింది. ఆ క్రమంలో తెలంగాణలో బలమైన రాజకీయ శక్తిగా ఎదిగిన టీఆర్ఎస్ను ఢీకొట్టేందుకు బీజేపీ నేతలు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని అంది పుచ్చుకుంటున్నారు.
ఆ క్రమంలో కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారంటూ ఇప్పటికీ పలుసార్లు బహిరంగంగా ప్రకటించిన బీజేపీ నేతలు ఆ మేరకు వారికి త్వరలో కాషాయ తీర్థం పోయనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ నెల 17వ తేదీన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్ర పర్యటన నేపథ్యంలో కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అందులో ఎనిమిది మంది టీఆర్ఎస్ నేతల పేర్లు ప్రస్తావించడం కొసమెరుపు.
1994లో 450.. ఇప్పుడేమో లక్షలు.. బాలాపూర్ లడ్డు ప్రస్థానం ఇలా
ఆ ఎనిమిది మంది టీఆర్ఎస్ నేతల జంప్ ఖాయమా?
మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి చెలరేగింది. మంత్రి పదవులు వస్తాయని ఆశించిన కొందరు నేతలకు చుక్కెదురు కావడంతో గులాబీ బాస్పై పరోక్షంగా ఆరోపణలు గుప్పించారు. అయితే మంత్రి పదవులు ఇస్తామని తమకు ఆశ జూపి చివరకు మొండి చేయి చూపారనేది వారి వాదన. ఆ క్రమంలో కొందరు నోరు విప్పితే.. మరికొందరు ఆజ్ఞాతంలోకి వెళ్లారు. అదలావుంటే బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ బీజేపీ ఎంపీ అర్వింద్ను కలవడం చర్చానీయాంశమైంది. ఈ నేపథ్యంలో వాట్సాప్లో బిగ్ బ్రేకింగ్ అంటూ ఓ మేసేజ్ వైరల్గా మారింది.
మాజీ మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తాటికొండ రాజయ్య, జోగు రామన్న, జూపల్లి కృష్ణారావుతో పాటు ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు, బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, షకీల్ అమీర్ బీజేపీలో చేరనున్నారనేది దాని సారాంశం. మంత్రి వర్గ విస్తరణ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి చెలరేగిన మాట వాస్తవమే అయినప్పటికీ.. ఈ ఎనిమిది మంది బీజేపీలో చేరబోతున్నారా అనేది అనుమానస్పదంగానే ఉంది.
కేసీఆరే మా నాయకుడు.. తగ్గుతున్న నేతలు
అదలావుంటే గులాబీ బాస్పై అలకబూనిన నాయిని, జోగు తదితర నేతలు ఆ తర్వాత మాట మార్చారు. కేసీఆరే మా నాయకుడంటూ సెలవిచ్చారు. బోధన్ ఎమ్మెల్యే షకీల్ కూడా మొదట పార్టీని వీడటం ఖాయమన్న రీతిలో మాట్లాడారని.. మళ్లీ సాయంత్రం కల్లా రివర్స్ గేర్ వేశారనే ప్రచారం జరుగుతోంది. పార్టీని వీడేది లేదంటూ.. కేసీఆర్తో దశాబ్దానికి పైగా తనకు సంబంధాలున్నాయంటూ చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వ పథకం ఒకటి బోధన్కు శాంక్షన్ అయిన నేపథ్యంలో బీజేపీ ఎంపీ అర్వింద్ను మర్యాదపూర్వకంగా కలిశానే తప్ప పార్టీ మారే యోచన లేదని చెప్పుకొచ్చారు. నాయిని నర్సింహారెడ్డి కూడా తనకు పార్టీలో సరైన ప్రాధాన్యం దక్కడం లేదనడం.. జోగు రామన్న ఆజ్ఞాతంలోకి వెళ్లడం.. ఆ తర్వాత ఇద్దరూ కూడా కేసీఆర్ మా నాయకుడంటూ మాట్లాడటం చర్చానీయాంశమైంది.
తెలంగాణ తలసరి ఆదాయంలో రంగారెడ్డి టాప్.. జగిత్యాల లాస్ట్
కారు హవాతో గెలిచి పార్టీ మారుతారా?
మంత్రివర్గ విస్తరణపై అసంతృప్త గళాలు వినిపించిన నేతలు సైతం ఆ తర్వాత ఎందుకు వెనక్కి తగ్గుతున్నారు. టీఆర్ఎస్ అధిష్టానం బుజ్జగిస్తోందా లేదంటే బెదిరింపులకు గురి చేస్తోందా అనే వాదనలు లేకపోలేదు. ఉద్యమం నుంచి బలమైన రాజకీయ శక్తిగా ఎదిగిన టీఆర్ఎస్కు క్షేత్ర స్థాయిలో మంచి ప్రజాదరణ ఉంది. ఆ క్రమంలోనే 2014లోనూ, 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయ ఢంకా మోగించి రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. పార్టీ టికెట్లు పొందిన చాలామంది కూడా కారు జోరుపైనే గెలిచారనేది పార్టీ పెద్దల ఆలోచన. ఎన్నికల సమయంలో టికెట్లు ఇచ్చి గెలిపించిన తర్వాత పార్టీ మారుతారా అనే ధోరణిలో కొందరిని బుజ్జగిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి టీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతోందనేది మాత్రం బయటకు పొక్కడం లేదు. అదే సమయంలో ఏదో జరుగుతోందనే ప్రచారం మాత్రం వైరల్ అవుతోంది.