తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. 29 మంది మృతి.. హైదరాబాద్లో 63 కంటైన్మెంట్ జోన్లు
తెలంగాణలో భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. మొన్న రాత్రి 8 గంటల నుంచి గురువారం(ఏప్రిల్ 22) రాత్రి 8 గంటల వరకు రికార్డు స్థాయిలో 6206 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 29 మంది కరోనాతో ప్రాణాలు విడిచారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ శుక్రవారం(ఏప్రిల్ 23) హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
హెల్త్ బులెటిన్ ప్రకారం... మరో 5531 రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,79,494కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 1,928కి చేరింది. ప్రస్తుతం 52,7264 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 3052 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 3,24,840కి చేరింది.
ప్రస్తుతం దేశంలో మరణాల రేటు 1.2శాతం ఉండగా... తెలంగాణలో 0.51శాతం ఉంది. జాతీయ స్థాయిలో రికవరీ రేటు 83.9 శాతం ఉండగా తెలంగాణలో 85.59 శాతం ఉంది. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1005 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకూ 1,22,81,027 కరోనా టెస్టులు నిర్వహించారు.
కరోనా కట్టడి కోసం జీహెచ్ఎంసీ పరిధిలోని ఆరు జోన్లలో మొత్తం 63 కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు.ఛార్మినార్ పరిధిలో 12, సికింద్రాబాద్ పరిధిలో 11, ఎల్బీ నగర్, ఖైరతాబాద్, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి పరిధిలో పదేసి చొప్పున కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు.ఐదుకు మించి కరోనా కేసులు ఉన్న అన్ని ప్రాంతాల్లో మైక్రో కంటైన్మెంట్ చర్యలు తీసుకుంటున్నారు. ఆ ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తిని నియంత్రించేలా సోడియం హైపోక్లోరైడ ద్రావకాన్ని పిచికారీ చేయిస్తున్నారు.
ఇక తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా కరోనా బారినపడిన సంగతి తెలిసిందే.ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా బారిన పడగా... తాజాగా మంత్రి కేటీఆర్ కూడా వైరస్ బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న ఆయన... ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉన్నారు.గత కొద్దిరోజులుగా తనను కలిసినవాళ్లు కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలని,జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
గురువారం(ఏప్రిల్ 21) టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. దురదృష్టవశాత్తు తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని... ఇప్పటికైతే ఎలాంటి కరోనా లక్షణాలు లేవని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. వైద్యుల సూచనల మేరకు హోం ఐసోలేషన్లో ఉన్నట్లు తెలిపారు. బయటకు వెళ్లేవారు తప్పనిసరిగా మాస్కు ధరించాలని సూచించారు. ఇక రెండు రోజుల క్రితం సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్న కేసీఆర్ ప్రస్తుతం కోలుకుంటున్నారు.
దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 2,73,810 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 150,61,919కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 19,29,329 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో మరో 1,625 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 178,793.కి చేరింది. ప్రస్తుతం 32,404,454 కరోనా కేసులతో అమెరికా ప్రపంచంలోనే అగ్ర స్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాతి స్థానాల్లో భారత్,బ్రెజిల్ ఉన్నాయి.