కరోనా డర్: తెలంగాణలో ఒకేరోజు మూడు: 30కి చేరిన వైరస్ పాజిటివ్ కేసులు: కరీంనగర్లో స్థానికుడికి..!
హైదరాబాద్: కరోనా వైరస్ను నియంత్రించడానికి ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా, దాని తీవ్రత మాత్రం తగ్గట్లేదు. పాజిటివ్ కేసుల సంఖ్యకు అడ్డుకట్ట పడట్లేదు. మనిషనేవాడు రోడ్డు మీదికి రాకుండా తెలంగాణ సర్కార్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినా.. వైరస్ మాత్రం రెక్కలు చాస్తూనే ఉంది. ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తూనే ఉంది. తాజాగా తెలంగాణలో ఒకేరోజు మూడు పాజిటివ్ కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. దీనితో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 30కి చేరింది.
123 సంవత్సరాల కిందటి బ్రిటీష్ చట్టాన్ని జనంపై ప్రయోగిస్తోన్న జగన్, కేసీఆర్: కఠిన నిర్ణయాలతో కలకలం..!
తాజా హెల్త్ బులెటిన్
రాష్ట్రంలో తాజాగా నెలకొన్న పరిణామాలపై తెలంగాణ వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు సోమవారం మధ్యాహ్నం బులెటిన్ను విడుదల చేశారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 30కి చేరినట్లు వెల్లడించారు. ఇందులో ఒకటి కరీంనగర్లో, మరో రెండు హైదరాబాద్లో నమోదైనట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ నెల 31వ తేదీ వరకు లాక్డౌన్ కొనసాగుతుందని, ప్రస్తుతం నెలకొన్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని దీన్ని పొడిగించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.
ఫ్రాన్స్ , లండన్ నుంచి వచ్చిన యువకుల్లో.. .
కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉన్న ఫ్రాన్స్, ఇంగ్లండ్ల నుంచి హైదరాబాద్కు చేరుకున్న ఇద్దరు యువకులకు పరీక్షలను నిర్వహించగా.. పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు స్పష్టం చేశారు. హైదరాబాద్కు చెందిన 21 సంవత్సరాల యువకుడు ఫ్రాన్స్ నుంచి స్వస్థలానికి చేరుకున్నాడని, అతనికి వైద్య పరీక్షలు నిర్వహించగా..పాజిటివ్గా తేలినట్లు తెలిపారు. అలాగే- 30 సంవత్సరాల వ్యక్తి లండన్ నుంచి హైదరాబాద్కు వచ్చాడని, అతనిలో వైరస్ లక్షణాలు కనిపించినట్లు పేర్కొన్నారు. వారిద్దర్నీ సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ వార్డుకు తరలించినట్లు బులెటిన్లో తెలిపారు.
కరీంనగర్ కేసు ఆందోళనకరంగా..
ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేని 23 సంవత్సరాల కరీంనగర్ యువకుడికి వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. కొద్దిరోజుల కిందటే ఇండొనేషియా నుంచి కరీంనగర్కు వచ్చిన ఎనిమిది మంది స్థానికులతో కూడిన బృందం సభ్యులతో అతను కలిశాడని, వారితో కలిసి తిరిగాడని పేర్కొన్నారు. ఫలితంగా- కరీంనగర్ యువకుడు కూడా వైరస్ బారిన పడినట్లు స్పష్టం చేశారు. ఒకేసారి మూడు పాజిటివ్ కేసులు నమోదు కావడం కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తోంది.
Recommended Video
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా..
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండటంతో అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. కొత్తగా పాజిటివ్ కేసులు నమోదైన వారు ఎవరెవర్ని కలిశారనే విషయంపై ఆరా తీస్తున్నారు. అనుమానితులకు క్వారంటైన్, ఐసొలేషన్ వార్డులకు తరలించి, వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఈ నెల 31వ తేదీ వరకు లాక్డౌన్ ప్రకటించినప్పటికీ.. వైరస్ వ్యాప్తి చెందటానికి బ్రేకులు పడట్లేదని వాపోతున్నారు అధికారులు.