సప్పుడు లేదు, కాలుష్యం లేదు.. ఇవాళ్టి నుంచే కొత్త ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ ప్రస్థానంలో మరో మైలురాయి. సౌండ్, ఎయిర్ పొల్యూషన్ లేని ఎలక్ట్రిక్ బస్సులు.. హైదరాబాద్ రోడ్లపై సందడి చేయనున్నాయి. శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు నడిచే 40 ఎలక్ట్రిక్ బస్సులను మంగళవారం (05.03.2019) ప్రారంభించనున్నారు. ప్రధానంగా రెండు మార్గాల ద్వారా వీటిని నడపనున్నారు. మియాపూర్ తో పాటు కంటోన్మెంట్ డిపో నుంచి ఈ బస్సులు నడుస్తాయి.
కంటోన్మెంట్ డిపోకు చెందిన ఎలక్ట్రిక్ బస్సులు జూబ్లీ బస్ స్టేషన్ నుంచి బయలుదేరుతాయి. అలాగే మియాపూర్ డిపోకు చెందిన బస్సులు BHEL తో పాటు మియాపూర్ నుంచి నడుస్తాయి. జూబ్లీ బస్ స్టేషన్ నుంచి విమానాశ్రయానికి 265 రూపాయలు ఛార్జీ వసూలు చేయనుండగా.. మియాపూర్ నుంచి 280 వరకు ఛార్జీలు ఉండనున్నాయి.
అన్నీ అందులోనే..!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ బస్సులు రానే వచ్చాయి. హైదరాబాద్ లో పొల్యూషన్ తగ్గించేందుకు ఇప్పటికే సీఎన్జీ బస్సులు నడుపుతోంది తెలంగాణ ఆర్టీసీ. పెరుగుతున్న జనాభా, దానికనుగుణంగా రెట్టింపవతున్న కాలుష్యం దృష్టిలో పెట్టుకుని నివారణ చర్యలకు శ్రీకారం చుట్టారు అధికారులు. అందులోభాగంగా మంగళవారం నుంచి ప్రయాణీకులకు ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెస్తున్నారు.
40 బస్సులు మంగళవారం నుంచి హైదరాబాద్ రోడ్లపై పరుగులు పెట్టనున్నాయి. మియాపూర్, కంటోన్మెంట్ మార్గాల మీదుగా ఎలక్ట్రిక్ బస్సులు ప్రయాణీకులకు సేవలందిస్తాయి. వీటిలో ఏసీ, వైపై, రేడియో సిస్టం లాంటి లేటేస్ట్ సదుపాయాలు ప్రయాణీకులకు కొత్త అనుభూతిని మిగల్చనున్నాయి.
మంత్రివర్గ విస్తరణతో అసంతృప్తుల సెగ?.. తారక మంత్రం ఫలించేనా?
కెపాసిటీ 40, ఒక్క ఛార్జింగ్ కు 250 కి.మీ
12 మీటర్ల పొడవుతో ఉండే ఈ ఎలక్ట్రిక్ బస్సులో డ్రైవర్ తో పాటు మరో 39 మంది ప్రయాణించవచ్చు. అంటే 40 కెపాసిటీ అన్నమాట. లిథియం ఇయాన్ బ్యాటరీతో నడిచే ఈ ఎలక్ట్రిక్ బస్సులు.. ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ పెడితే ఎలాంటి ఆటంకాలు లేకుండా దాదాపు 250 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తాయి. సుమారుగా 5 గంటల్లో బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అవుతుందట. వయో వృద్ధులు ఎక్కి దిగడానికి వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు ఉండటం విశేషం. ఎయిర్, సౌండ్ పొల్యూషన్ లేకపోవడం ఈ బస్సుల స్పెషాలిటీ.
నో టెన్షన్.. హ్యాపీ జర్నీ
ఆర్టీసీ కొత్తగా తెరపైకి తెచ్చిన ఎలక్ట్రిక్ బస్సుల్లో ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. టెంపరేచర్ పెరిగినప్పుడు గానీ, ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు గానీ.. ప్రాణనష్టం జరగకుండా స్పెషల్ ప్రొటెక్షన్ వ్యవస్థను సిద్ధం చేశారు. ముందు వెనకాల సౌకర్యవంతమైన సస్పెన్షన్ సిస్టమ్ ఏర్పాటు చేయడంతో ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సుఖవంతమైన ప్రయాణ అనుభూతి లభిస్తుంది. అంతేకాదు ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ విధానంతో పాటు ఎల్ఈడీ లైటింగ్ ఈ బస్సులకు ప్రధాన ఆకర్షణగా చెప్పొచ్చు.
సైనిక వీరుడు అభినందన్ కథతో సినిమా.. ఆ పాత్రకు జాన్ అబ్రహమేనా?
ఛార్జీలు ఇలా..!
కంటోన్మెంట్ నుంచి ఉప్పల్ మార్గంలో ఎయిర్ పోర్టుకు నడిచే ఎలక్ట్రిక్ బస్సుల్లో ఛార్జీలు ఈ విధంగా ఫిక్స్ చేశారు. జేబీఎస్, సంగీత్, తార్నాక స్టాపుల నుంచి విమానాశ్రయానికి 265 రూపాయలు.. ఉప్పల్ క్రాస్రోడ్, ఎల్బీనగర్ నుంచి 210 రూపాయలు.. చాంద్రాయణగుట్ట నుంచి 160 రూపాయలు.. పహాడీషరీఫ్ నుంచి 105 రూపాయలు వసూలు చేయనున్నారు. అలాగే ఆరాంఘర్ మార్గంలో నడిచే బస్సుల్లో జేబీఎస్, సంగీత్, సెక్రటేరియట్ స్టాపుల నుంచి ఎయిర్ పోర్టుకు 265 రూపాయలు.. ఏసీ గార్డ్స్, ఎన్ఎండీసీ నుంచి 210 రూపాయలు.. ఆరాంఘర్ నుంచి 160 రూపాయలు.. శంషాబాద్ నుంచి ఎయిర్పోర్టుకు 105 రూపాయలు ఛార్జీలుగా నిర్ణయించారు.
టికెట్ ధరలు..!
ఇక బీహెచ్ఈఎల్ నుంచి నడిచే బస్సుల్లో బీహెచ్ఈఎల్, లింగంపల్లి నుంచి విమానాశ్రయానికి 265 రూపాయలు.. ఆల్విన్ క్రాస్రోడ్స్, శిల్పారామం, గచ్చిబౌలి నుంచి 210 రూపాయలు వసూలు చేయనున్నారు. ఇక మియాపూర్ నుంచి బయలుదేరే బస్సుల్లో మియాపూర్ నుంచి ఎయిర్పోర్టు వరకు 280 రూపాయలు.. జేఎన్టీయూ నుంచి విమానాశ్రయానికి 265 రూపాయలు.. శిల్పారామం, గచ్చిబౌలి నుంచి ఎయిర్పోర్టు వరకు 210 రూపాయలుగా ఛార్జీలు నిర్ణయించారు.
డమ్మీ పిస్టోల్, నకిలీ పోలీస్.. దారి కాచి దోచారు.. చివరకు ఏమైందో తెలుసా?