ఆర్టీసీ సమ్మెపై అఖిలపక్ష సమావేశం.. భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం..!
హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మె అటు ప్రభుత్వానికి, ఇటు కార్మిక వర్గానికి మధ్య చిచ్చు రేపినట్లైంది. న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన దరిమిలా కనికరించలేదనేది యూనియన్ నేతల మాట. లేదు లేదు.. పండుగ సమయంలో ఆకస్మాత్తుగా సమ్మెకు దిగడం చట్ట విరుద్ధం అంటోంది సర్కార్. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం కార్మిక సంఘాలకు మింగుడు పడటం లేదు. అందుకే బుధవారం (09.10.2019) నాడు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ.
సమ్మె నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై కార్మికల సంఘాల జేఏసీ నేతలు మండిపడుతున్నారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాల్సింది పోయి.. కార్మికులపై కక్ష సాధింపు చర్యలేంటని మండిపడుతున్నారు. ఆ క్రమంలో బుధవారం నాడు హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఇదే వేదికపై తమ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించనున్నారు. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ నేతృత్వంలో అన్నీ రాజకీయ పార్టీల నేతలను ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
ఒక్క ఎమ్మెల్యే కోసం ఎన్ని కష్టాలో.. ఆ గుర్తులు కొంప ముంచేనా?
ఇటు కార్మికులు మెట్టు దిగకపోవడం.. అటు ప్రభుత్వం బెట్టు చేయడం.. వెరసి ఆర్టీసీ సమ్మె ప్రభావం ప్రజలపై పడింది. దసరా పండుగ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లడానికి జనాలు నానా కష్టాలు పడ్డారు. ప్రైవేట్ వాహనాలు వీలైనన్ని ఎక్కువగా అందుబాటులో ఉంచామని ప్రభుత్వ పెద్దలు చెప్పినప్పటికీ అది ఆచరణలో మాత్రం కనిపించిన దాఖలాలు లేవు. సరైన సంఖ్యలో బస్సులు లేక ఊళ్లకు వెళ్లేందుకు ప్రజలు ఇబ్బందులు పడ్డ ఘటనలు కొకొల్లలు.
అదలావుంటే ప్రభుత్వం దిగొచ్చేంత వరకు సమ్మె విరమించే ప్రసక్తి లేదని జేఏసీ నేతలు చెబుతున్నారు. ఆ క్రమంలో బుధవారం నాడు జరగబోయే అఖిలపక్ష సమావేశం చర్చానీయాంశంగా మారింది. అటు ప్రభుత్వం ససేమిరా అంటుంటే.. ఇటు జేఏసీ నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనేది హాట్ టాపికైంది.