రైతుబంధు సాయానికి లైన్ క్లియర్.. ఈ నెల చివరి నుంచి రైతుల ఖాతాలకు బదిలీ
హైదరాబాద్ : ఎండాకాలం వెళ్లిపోనుంది. వర్షాకాలాన్ని ఆహ్వానిస్తూ ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో వ్యవసాయంపై రైతులు దృష్టి సారించారు. అయితే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు సాయం కోసం అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. ఇదివరకు ఎకరానికి 4 వేల రూపాయలు ఇచ్చేవారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ హామీ మేరకు అది ఐదు వేల రూపాయలకు చేరింది. ఆ క్రమంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుండటంతో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు కీలక ప్రకటన చేశారు.
వారెవ్వా.. ప్రారంభమే కాలేదు.. కరీంనగర్ రూపాయి పథకానికి ప్రశంసలు
ఖరీఫ్ సీజన్కు రైతు బంధు
వేసవి కాలం ముగుస్తూనే ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుంది. ఆ మేరకు తెలంగాణ సర్కార్ అమలు చేయాల్సిన రైతు బంధు పథకంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. గతంలో ఈ పథకం కింద రైతులకు ఎకరాకు నాలుగు వేలు ఇచ్చిన ప్రభుత్వం.. ఇకపై ఐదు వేల రూపాయలకు పెంచింది. అసెంబ్లీ ఎన్నికల వేళ సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు రైతు బంధు సాయం కింద ఒక్కో ఎకరానికి ఐదు వేల రూపాయలు విడుదల కానున్నాయి.
ఎన్నికల హామీ మేరకు రైతుల ఖాతాల్లో ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున జమ చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఆ మేరకు రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు మంగళవారం (21.05.2019) నాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
ఆర్థిక శాఖ ప్రకటనతో రైతుల్లో ఊరట
2018, మే 11వ తేదీన రాష్ట్రంలో రైతు బంధు పథకం ప్రారంభమైంది. ఆ సమయంలో ఖరీఫ్ సీజన్కు ఎకరానికి నాలుగు వేల రూపాయల చొప్పున పంపిణీ చేశారు. అప్పుడు రైతులందరికీ కూడా చెక్కులు పంపిణీ చేశారు. అయితే రబీ సీజన్ వచ్చేసరికి కొన్ని ఆటంకాలు ఏర్పడ్డాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో కోడ్ అడ్డొచ్చింది.
అయితే ఎన్నికల సంఘం అనుమతి తీసుకుని రైతు బంధు సాయాన్ని కంటిన్యూ చేశారు. రైతుల ఖాతాల్లోకి నేరుగా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా జమ చేశారు. అదలావుంటే ఖరీఫ్ సీజన్ దగ్గరకు రావడంతో రైతు బంధు సాయం ఊసు లేకుండా పోయింది. మరికొద్ది రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుండటంతో అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. ఆ క్రమంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ స్పష్టమైన ప్రకటన చేయడంతో కాసింత ఊరట లభించినట్లైంది.
6 వేల కోట్ల నిధులు రెడీ..!
లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక.. రైతు బంధు సాయం అందిస్తామని ఆయన తెలిపారు. గత రబీ సీజన్ మాదిరిగానే ఆన్లైన్ ద్వారా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. దానికి సంబంధించి నిధుల సమీకరణ కూడా పూర్తయిందని వివరించారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో తొలి ఆరు నెలలకు గాను 6 వేల కోట్ల రూపాయలు సమకూర్చామని, ఏడాదికి 12 వేల రూపాయల కోట్లు అవసరమవుతాయని తెలిపారు. రైతు బంధు సాయం పంపిణీ ఈ నెల చివరి నుంచి ప్రారంభించి.. జూన్ మొదటి వారంలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
మే చివరి నుంచి ఆన్లైన్ ట్రాన్స్ఫర్
ఇదివరకు రైతు బంధు సాయం పంపిణీకి చాలా సమయం తీసుకుందన్నారు. దాదాపు రెండున్నర నెలలు పట్టిందని.. ఇప్పుడు అలా జరగకుండా చూస్తామని తెలిపారు. ఖరీఫ్ సీజన్లో ప్రతి రైతుకు వీలైనంత త్వరగా ఆర్థిక సాయం అందేలా చూస్తామన్నారు. అలాగే పంట రుణాల మాఫీ నాలుగు విడతల్లో జరుగుతుందని చెప్పారు. రుణాల మాఫీ విషయంలో అన్నదాతలకు ఇబ్బందులు తలెత్తకుండా నిధుల సమీకరణ పూర్తి చేసినట్లు తెలిపారు. దీనికోసం మొదటి ఆరు నెలల కోసం మూడు వేల కోట్ల రూపాయలు సమకూర్చినట్లు వెల్లడించారు.