నిజామాబాద్ ఎన్నికలు.. రైతుల అనుమానాలు నివృత్తి.. 9న ర్యాలీకి అనుమతి : ఈసీ
హైదరాబాద్ : లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ పార్లమెంటరీ సెగ్మెంట్ దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించింది. సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవితపై 178 మంది రైతులు పోటీకి దిగడం చర్చానీయాంశమైంది. అయితే అక్కడ ఎన్నికల నిర్వహణకు అన్నీ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్.
పొలిటికల్ యాడ్స్పై ఈసీ కన్ను.. ఆ రెండు రోజులు నిషేధం..!
ఎన్నికల కసరత్తు
11వ తేదీ నాడు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుందని.. అయితే ఉదయం 6 నుంచి 8 గంటల వరకు రెండు గంటల పాటు మాక్ పోలింగ్ ఉంటుందని చెప్పారు. ఓటర్లకు అవగాహన కలిగించేందుకు నిజామాబాద్ సెగ్మెంట్ పరిధిలోని అధికార యంత్రాంగం తలమునకలైంది. పలుచోట్ల మోడల్ పోలింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేటట్లు చూస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో "U" ఆకారంలో ఈవీఎంలు ఉంటాయని మొదట ప్రకటించినా.. చివరకు "L" ఆకారంలో సెట్ చేశారు.
అన్నదాతల ర్యాలీకి ఈసీ ఓకే
నిజామాబాద్ పార్లమెంటరీ బరిలో నిలిచిన రైతు అభ్యర్థులు.. ఎన్నికల నిర్వహణ తీరుపై మొదటినుంచి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈవీఎంలు వద్దు.. బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు నిర్వహించాలంటూ న్యాయపోరాటానికి సైతం సిద్ధమయ్యారు. ఆ క్రమంలో ఎన్నికల ప్రక్రియపై రైతుల అనుమానాలు నివృత్తి చేసినట్లు తెలిపారు రజత్ కుమార్. తామిచ్చిన సమాధానాలతో వారు సంతృప్తి వ్యక్తం చేసినట్లు చెప్పారు. ఈ నెల 9న నిజామాబాద్ లో రైతులు తలపెట్టిన ర్యాలీకి అనుమతి ఇచ్చామన్నారు.
అందుబాటులో హెలికాప్టర్..!
నిజామాబాద్ బరిలో ఈసారి 185 మంది అభ్యర్థులు పోటీపడుతుండటంతో అవసరమైన అన్నీ చర్యలు తీసుకుంటున్నారు ఈసీ అధికారులు. అందులోభాగంగా ఒక హెలికాప్టర్ కూడా కేటాయించారు. నిజామాబాద్ లోక్సభ సెగ్మెంట్ లోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో హెలిప్యాడ్స్ సిద్ధం చేస్తున్నామని రజత్ కుమార్ తెలిపారు. 400 మంది ఇంజినీర్లు కంటిన్యూయస్ గా పనిచేస్తున్నారని చెప్పారు. పోలింగ్ నాడు ఒక్కో సెక్టార్ కు సంబంధించిన అధికారి వెంట ఒక్కో ఇంజినీర్ అందుబాటులో ఉంటారని వివరించారు.
ఆటంకం కలిగిస్తే చర్యలు తప్పవు
రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ స్లిప్పులు, గుర్తింపు కార్డుల పంపిణీ దాదాపు 95 శాతం పూర్తయినట్లు తెలిపారు రజత్ కుమార్. అదలావుంటే ఎన్నికల విధులకు మాజీ సైనికులను వినియోగించుకోవడానికి ఈసీ పర్మిషన్ ఇవ్వలేదు. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను ఎన్నికల విధులకు ఉపయోగించుకోనున్నట్లు తెలిపారు. అదనపు కేంద్ర బలగాలు కావాలని సెంట్రల్ గవర్నమెంట్ ను కోరామని.. అవసరాన్ని బట్టి కేటాయించే ఛాన్సుందని చెప్పారు. ఎన్నికల విధులకు ఆటంకం కలిగిస్తే.. ఎంతటివారినైనా ఉపేక్షించబోమని రజత్ కుమార్ హెచ్చరించారు.