మేడారం, వేయిస్తంభాల గుడి, బతుకమ్మలతో శకటం, రిపబ్లిక్ డేకు తెలంగాణ శకటం, రెండోసారి...
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని రాజ్పథ్ వద్ద శకటాలు ప్రదర్శిస్తారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక 2015లో బోనాలు రూపకాన్ని ప్రదర్శించారు. నాలుగేళ్ల తర్వాత 2020 జనవరి 26వ తేదీన సమ్మక్క సారలమ్మ రూపకాన్ని ప్రదర్శించబోతున్నారు. దీంతోపాటు వేయి స్తంభాల గుడి, బతుకమ్మ ప్రాధాన్యతలు శకటంపై కొలువుదీరబోతున్నాయి. ఈ మేరకు రక్షణశాఖ ఆధ్వర్యంలోని సెరిమోనియల్ కమిటీ ఆమోదం తెలిపినట్టు ప్రకటనలో పేర్కొన్నది.
శకటాల ప్రదర్శన..
రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీలోని రాజ్పథ్లో ఆయా రాష్ట్రాల సాంస్కృతిక వైభవాన్ని తెలిపేలా శకటాలపై ప్రదర్శిస్తారు. 2015లో తెలంగాణ రాష్ట్రం నుంచి శకటానికి అనుమతి లభించింది. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన బోనాలు రూపకాన్ని కళాకారులు ప్రదర్శించారు. తర్వాత బతుకమ్మ, మేడారం జాతరకు సంబంధించిన ఆకృతిని రూపొందించినా చివరి దశలో ఎంపిక కాలేదు.
రెండోసారి
ప్రతీ ఏటా వివిధ ఆకృతుల్లో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే శకట నమూనాలను పంపించారు. కానీ కేంద్ర రక్షణశాఖ ఆధ్వర్యంలోని సెరిమోనియల్ కమిటీ మాత్రం శకటాలను ఎంపిక చేయలేదు. 2015 తర్వాత ప్రతీ ఏటా శకటాల నమూనాలు పంపిస్తూనే ఉన్నారు. ఇన్నాళ్లకు మేడారం సమ్మక్క సారాలమ్మ జాతర, బతుకమ్మ, వేయి స్తంభాల గుడి ఆకృతితో రూపొందించిన శకటం ఎంపికైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది రెండోసారి అవకాశం లభించింది.
వెల్డన్ గౌరవ్..
2020 రిపబ్లిక్ డే రోజున తెలంగాణ శకటానికి చోటు దక్కడంపై ఐటీశాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. మన సంస్కృతి, సాంప్రదాయాలను ఢిల్లీ వేదికగా ప్రదర్శించబోతున్నామని చెప్పారు. మేడారం, బతుకమ్మ ప్రదర్శనలతో, వేయిస్తంభాల గుడి వేదికగా, కళాకారుల నృత్యాలతో శకట ఆకృతి బాగుందన్నారు. శకటం ఎంపికయ్యేందుకు విశేషంగా కృషి చేసిన రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ను అభినందించారు.