మొన్న బండి సంజయ్..నేడు కవిత: స్పాట్ ఒక్కటే: భాగ్యలక్ష్మి ఆలయం వద్ద భోగీ వేడుకల్లో
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలు జోరుగా సాగుతున్నాయి. చాలా చోట్ల తెల్లవారు జామునే భోగి మంటలను వెలిగించి, సంప్రదాయబద్ధంగా పండుగను జరుపుకొంటున్నారు. పాత వస్తువులను భోగి మంటల్లో దహనం చేశారు. ఈ వేడుకలు కాస్తా రాజకీయ కేంద్రబిందువుగా కూడా మారింది. ఏపీలో తెలుగుదేశం పార్టీ నేతలు..ప్రభుత్వం విడుదల చేసిన కొన్ని జీవోలను భోగి వేసి దగ్ధం చేయగా.. తెలంగాణలో తెలంగాణ జాగృతి ఈ వేడుకను వైభవంగా నిర్వహించింది. దీనికోసం హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని ఎంచుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
తెలంగాణ రాష్ట్ర సమితి శాసన మండలి సభ్యురాలు
తెలంగాణ రాష్ట్ర సమితి శాసన మండలి సభ్యురాలు, తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత.. ఈ తెల్లవారు జామున చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయం వద్ద నిర్వహించిన భోగి వేడుకల్లో పాల్గొన్నారు. ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలను తెలిపారు. భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని అకాంక్షించారు. ఏడాది కాలంగా కరోనా వైరస్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోందని, దాని నుంచి విముక్తి కలగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. వచ్చు సంక్రాంతి పండుగను కరోనా రహిత ప్రపంచంలో జరుపుకొంటామనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
అమ్మవారి ఆలయం వద్ద భోగీ మంటలను వెలిగించడం
భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద భోగీ మంటలను వెలిగించడం రాజకీయంగా అందరి దృష్టిని ఆకర్షించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఈ ఆలయం వద్ద నుంచే తమ ప్రచార కార్యక్రమాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. బీజేపీ తెలంగాణ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బండి సంజయ్.. భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించిన అనంతరం ప్రచార పర్వంలో పాల్గొన్నారు. ఆ తరువాత కూడా.. ఆయన అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తాము విజయం సాధిస్తే.. హైదరాబాద్ అనే పేరును తొలగించి.. భాగ్యనగరం అని పెడతామంటూ అప్పట్లో ప్రకటించారు.
బీజేపీ కార్పొరేటర్ల ప్రమాణం అక్కడే..
ఫలితాలు వెలువడిన తరువాత కూడా బీజేపీ నేతలు.. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. ఆ పార్టీ తరఫున ఎన్నికైన కార్పొరేటర్లందరూ అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. అవినీతి రహితమైన, స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తామంటూ అప్పట్లో వారు అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేశారు. ఈ పరిణామాల అనంతరం.. టీఆర్ఎస్ నేతలు, తెలంగాణ జాగృతి ప్రతినిధులు అదే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని కేంద్రబిందువుగా చేసుకోవడం, భోగీ వేడుకలను అక్కడే నిర్వహించడం అందరి దృష్టిని ఆకర్షించింది.
మొన్న బండి సంజయ్..నేడు కవిత: స్పాట్ ఒక్కటే: భాగ్యలక్ష్మి ఆలయం వద్ద భోగీ వేడుకల్లో#Kavitha @RaoKavitha #hyderabad pic.twitter.com/DF4FBd4g3I
— oneindiatelugu (@oneindiatelugu) January 13, 2021