Telangana Weather: మరో 3 రోజులపాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు: 48 గంటలపాటు ఏపీలోనూ
హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు పూర్తిగా ప్రవేశించడంతో తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా వరుసగా వానలు కురుస్తూనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజులపాటు హైదరాబాద్ తోపాటు తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
మంగళవారం, బుధవారం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములుు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తామని వెల్లడించింది. జార్ఖండ్, పరిసర ప్రాంతాలలో ఉన్న అల్పపీడనం మంగళవారం తెలంగాణ నుంచి కొంత దూరంగా వెళ్లిపోయింది. అయితే, నైరుతి రుతుపవనాలు తెలంగాణపై చురుకుగా కదులుతున్నాయి.
కిందిస్థాయి నుంచి పశ్చిమ గాలులు బలంగా వీస్తున్నాయని, వీటి ప్రభావంతో మూడు రోజులు మంగళ, బుధ, గురువారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మంగళ, బుధవారాల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
రాష్ట్రంలో రెండు రోజులపాటు అక్కడక్కడ గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం, దాని పక్కనే ఉన్న ఒడిశా, పశ్చిమబెంగాల్, జార్ఖండ్ తీరాలపై అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఎత్తులో నైరుతి దిశగా తిరిగి ఉంది.
ఇది పడమర దిశగా ప్రయాణించే అవకాశం ఉండటంతో రానున్న 48 గంటల్లో కోస్తాంధ్రలో కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి వానలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.