ముందే మాట్లాడుకున్నాం, మోడీ సర్ దీనిని నిజం చేశారు, అద్భుతం: హీరో నిఖిల్ ప్రశంస
హైదరాబాద్: పేదలకు పది శాతం రిజర్వేషన్కు లోకసభ మంగళవారం ఆమోదం తెలిపింది. రాజ్యాంగ సవరణకు దాదాపు అన్ని పార్టీలు అంగీకరించాయి. అన్నాడీఎంకే వాకౌట్ చేయగా, మజ్లిస్ పార్టీ వ్యతిరేకించింది. సస్పెన్షన్ కారణంగా టీడీపీ ఎంపీలు కీలక బిల్లుకు దూరంగా ఉన్నారు. బిల్లును ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్వాగతించారు.
ఈ బిల్లుపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. బిల్లును మంగళవారం లోకసభలో ప్రవేశ పెట్టిన సమయంలో ప్రముఖ తెలుగు నటుడు నిఖిల్ (నిఖిల్ సిద్ధార్థ) తన సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో స్పందించారు.
హీరో నిఖిల్ పోస్ట్
పేదలకు 10% కోటా అంటూ మీడియాలో వచ్చిన వార్తను నిఖిల్ పోస్ట్ చేసి రిజర్వేషన్ బిల్లు పైన స్పందించారు. అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్ కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. అదే సమయంలో ఈ విషయం గురించి తాను, నటుడు రానా ముందే చర్చించుకున్నామని చెప్పారు. రానా యాంకర్గా ఉన్న నెం.1 యారీ ప్రోగ్రాంలో ఇటీవల పాల్గొన్నప్పుడు ఈ అంసంపై చర్చించామని ట్వీట్ చేశారు.
10% రిజర్వేషన్ బిల్లుకు లోకసభ ఆమోదం, పార్టీలకు ప్రధాని మోడీ థ్యాంక్స్
మేం ముందే మాట్లాడుకున్నాం
కొద్ది వారాల క్రితం రానా వ్యాఖ్యాతగా వ్యవహరించే యారీ షోలో మేం ఈ రిజర్వేషన్ల గురించి మాట్లాడుకున్నామని, ఇప్పుడు మోడీ సర్ దీనిని నిజం చేసి అద్భుతమైన పనితీరును కనబరిచారని నిఖిల్ పేర్కొన్నారు. కులం, మతం, జాతి ఆధారంగా కాకుండా పేదల ప్రజలకు మేలు జరిగేలా ఈ నిర్ణయం తీసుకున్నారని అభిప్రాయపడ్డారు. జాతి వివక్షకు నో చెప్పాలని పేర్కొన్నారు.
అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు
కాగా, అగ్రవర్ణ పేదలకు ఆర్థిక స్థోమత ప్రాతిపదికగా విద్య, ఉద్యోగ రంగాల్లో పది శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. మంగళవారం దీనిని లోకసభలో ప్రవేశపెట్టారు. దీనికి లోకసభ ఆమోదం తెలిపింది.