కోడెల మృతిపై నేతలు ఏమన్నారంటే..!
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు మృతిపై తెలుగు రాష్ట్రాల నేతలు సంతాపం ప్రకటించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు. కోడెల మృతిపట్ల స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మంత్రి ఇంద్రకరణ్రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. మాజీ మంత్రి కడియం శ్రీహరి బసవతారకం ఆసుపత్రికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.
టీడీపీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు మరణంపై ఆ పార్టీ నేతలు సంతాపం ప్రకటించారు. ఆ క్రమంలో టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. వైసీపీ ప్రభుత్వ వేధింపుల వల్లే ఆయన మృతి చెందారని ఆరోపించారు. టీడీపీ కోసం తుది శ్వాస వరకు ఆయన పనిచేశారని కితాబిచ్చారు. పర్సనల్గా గొప్ప స్నేహితుడిని కోల్పోయానని చెప్పుకొచ్చారు. కోడెల ఫ్యామిలీ మెంబర్స్కు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
Recommended Video
చోరీల్లో నెంబర్ వన్.. దేనికి భయపడడు.. ఆ కుక్కను చూస్తే మాత్రం షేక్..!
కోడెలను వైసీపీ ప్రభుత్వం వేధింపులకు గురి చేసిందని టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు ఆరోపించారు. ఇది ముమ్మాటికీ రాజకీయ హత్యేనంటూ అభివర్ణించారు. ఆయన మృతి టీడీపీకి తీరని లోటు అన్నారు. వైసీపీ నేతల వేధింపుల వల్లే ఆయన చనిపోవాల్సి వచ్చిందని తెలిపారు.
కోడెల మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు అని అన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్. కోడెల ఆత్మకు శాంతి చేకూర్చాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఏపీలో ఆయన అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. కోడెల మృతి తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు.
కోడెల శివప్రసాద్ రావు ఉరేసుకుని చనిపోయారనే ప్రచారం సరికాదన్నారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. అందులో ఏమాత్రం నిజం లేదన్నారు. కోడెల మెడపై గాట్లు ఉండటంతో పోస్టుమార్టమ్ కోసం కోడెల భౌతికకాయాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తామన్నారు.