ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్తత .. పీపీఈ కిట్లతో ఎన్ఎస్యూఐ నిరసన .. పరీక్షల వాయిదాకు డిమాండ్
ప్రగతి భవన్ వద్ద ఈరోజు తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పిపిఈ కిట్లు ధరించి ఎన్ఎస్యూఐ కార్యకర్తలు ఈరోజు ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. హైకోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉన్నా తెలంగాణ ప్రభుత్వం పరీక్షల షెడ్యూల్ విడుదల చేయడాన్ని నిరసిస్తూ ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన ఎన్ఎస్యూఐ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కళ్లుగప్పి సీఎం కేసీఆర్ క్యాంప్ కార్యాలయానికి వచ్చిన కార్యకర్తలు ఆందోళన ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
కరోనా విధ్వంసం సృష్టిస్తుంటే సోకుల కోసం సెక్రటేరియట్ కు వందల కోట్లా ? రేవంత్ రెడ్డి సూటిప్రశ్న
ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు . రోజు రోజుకు తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని, కానీ తెలంగాణ ప్రభుత్వానికి కరోనాపై పట్టింపు లేదని ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఆరోపించారు. కేసులు పెరుగుతున్న సమయంలో పోటీ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసి ప్రభుత్వం విద్యార్థుల జీవితంతో ఆడుకుంటున్నదని పేర్కొన్నారు.
విద్యార్థుల జీవితాలపై ప్రభుత్వానికి ఎలాంటి పట్టింపు లేదని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం నిరంకుశ వైఖరితో అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నదని వారు మండిపడ్డారు. తెలంగాణ హైకోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉన్నా అదేదీ పట్టించుకోకుండా తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా పరీక్షల షెడ్యూలును విడుదల చేయడం తప్పని వారు పేర్కొన్నారు. అన్నిరకాల ప్రవేశ పరీక్షలను తెలంగాణ ప్రభుత్వం వెంటనే వాయిదా వేయాలంటూ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.