టెన్షన్ అక్కడ.. నిఘా ఇక్కడ : హైదరాబాద్ ఉగ్రమూలాలపై డేగ కన్ను
హైదరాబాద్ : దేశ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తత హైదరాబాద్ కు పాకింది. బోర్డర్ లో ఉగ్రమూకలు చెలరేగుతున్న కారణంగా.. హైదరాబాద్ లో నిఘా పెంచారు పోలీసులు. అంతేకాదు కేంద్ర నిఘా సంస్థ అధికారులు నగరానికి చేరుకుని సీక్రెట్ ఆపరేషన్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఉగ్రవాద కార్యకలాపాల లింకులున్నవారితో పాటు టెర్రరిస్ట్ సానుభూతిపరులపై కన్నేసినట్లు సమాచారం. పాకిస్థాన్, బంగ్లాదేశ్ తదితర దేశాల నుంచి వచ్చి భాగ్యనగరంలో తిష్ట వేసిన వారి వివరాలు సేకరించడంతో పాటు వారి వీసా గడువులను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
నగరంలో తిష్ట.. పోలీస్ నజర్
భారత్ టార్గెట్ గా పదుల సంఖ్యలో ఉగ్రవాద సంస్థలు ఇరవై ముప్పై ఏళ్లుగా నగరంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయనేది నిఘా వర్గాల అంచనాగా కనిపిస్తోంది. ఆ సంస్థలకు ఒకదానికొకటి సంబంధం లేకున్నా.. వాటి అంతిమ లక్ష్యం మాత్రం విధ్వంసమే. మెట్రో నగరాలే టార్గెట్ గా పనిచేసే ఈ సంస్థలకు పెద్దమొత్తంలో డబ్బులు అందుతున్నట్లు సమాచారం. ఎక్కడికక్కడ లోకల్ సానుభూతిపరులను ఎంపిక చేసుకుంటూ, వారికి డబ్బు ఆశజూపి పనికానిచ్చేస్తున్నాయి. అయితే కొద్ది నెలలుగా పోలీసులకు చిక్కిన టెర్రరిస్టుల కార్యకలాపాలపైన కేంద్ర నిఘా సంస్థ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఆ మేరకు నగరంలో సీక్రెట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు సమాచారం.
విస్తృత తనిఖీలు.. అడుగడుగునా అప్రమత్తం
ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలపై నజర్ పెట్టాయి పోలీస్ బృందాలు. స్పెషల్ టీమ్స్ తో పాటు ఆక్టోపస్ బృందాలు సైతం రహదారులపై విసృతంగా తనిఖీలు చేపడుతున్నాయి. రైల్వే స్టేషన్లతో పాటు ట్రైన్స్ లోపల, ప్లాట్ఫారాలపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ తో పాటు ఇతర పోలీస్ బలగాలు కూడా సోదాలు నిర్వహిస్తున్నాయి. ఇక హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో అనుమానస్పద ప్రాంతాల్లో గస్తీ పెంచారు. కొత్తగా వెలసిన కాలనీలతో పాటు శివారు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా బృందాలు అనుక్షణం అప్రమత్తంగా ఉంటున్నాయి.
ఓల్డ్ సిటీతో పాటు ఎల్బీనగర్, రాజేంద్ర నగర్, సికింద్రాబాద్, బోయిన్ పల్లి.. ఇలా నేషనల్ హైవేకు అటాచ్డ్ గా ఉన్న రహదారులపై వివిధ పోలీస్ బలగాలు సంయుక్త తనిఖీలు నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్ లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా కొద్దిరోజుల పాటు ఈ తనిఖీలు కంటిన్యూ చేసే అవకాశం కనిపిస్తోంది. కొన్నిచోట్ల అపరిచితులను సమీప పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. పూర్తిగా విచారించి వారు తెలిపిన వివరాలు కరెక్ట్ అనిపిస్తేనే విడిచిపెడుతున్నారు.
టెక్కీ టెర్రరిస్టులపై నిఘా
ఉగ్రవాద సంస్థలు టెక్నాలజీని కూడా వీపరీతంగా వాడుకుంటున్నాయనే నేపథ్యంలో అటువైపు కూడా దృష్టి సారించాయి నిఘా బృందాలు. టెర్రరిస్టులు తమ ఐటీ విభాగాన్ని దుబాయ్, ఇంగ్లండ్ తో పాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్ లలో ఏర్పాటు చేసినట్లు కొంతమేర గుర్తించాయి. నాలుగు సంవత్సరాల కిందట ఉబేద్ అనే ఓ ఇంజనీరింగ్ విద్యార్థి పట్టుబడటం అప్పట్లో కలకలం సృష్టించింది. హుజి సానుభూతిపరుడిగా, ఐటీ విభాగంలో అతడు పనిచేసినట్లు గుర్తించారు బెంగుళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.
అంతేకాదు హైదరాబాద్, బెంగళూరులలో ప్రజా ప్రతినిధులే టార్గెట్ గా హుజి ఏర్పాటు చేసిన టెర్రరిస్టులకు ఆశ్రయం కల్పించాడనే ఆరోపణలున్నాయి. ఉగ్రవాదుల ఐటీ విభాగం.. ఎప్పటికప్పుడు కార్యక్రమాలు రూపొందిస్తూ వాటిని అమలు చేయడానికి లోకల్ సానుభూతిపరులకు అందిస్తుంటుంది. అయితే సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొన్న సమయంలో.. హైదరాబాద్ లో ఉగ్రమూలాలపై డేగకన్ను వేసినట్లు తెలుస్తోంది.