ఉత్తమ్ ఇంటివద్ద మరోసారి ఉద్రిక్తత.!కాంగ్రెస్ నేతలను వెంటాడుతున్న గులాబీ పార్టీ.!
హైదరాబాద్ : ప్రాజెక్టుల పరిశీలన పేరుతో జలదీక్షలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను తెలంగాణ ప్రభుత్వం అష్టదిగ్బంధనం చేస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరు సంవత్సరాల కాలంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పై నిరసన కార్యక్రమాలకు సన్నాహాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. ఇప్పటికే రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు కృష్ణా పరవాహక ప్రాంత ప్రాజెక్టులను సందర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేసారు. ఇదే అంశంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు.
కష్ట కాలంలో కూడా కార్మికులను పట్టించుకోరా..? తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డి పిసీసీ ఛీఫ్ ఉత్తమ్..!
ఇది అప్రజాస్వామికం.. కాంగ్రెస్ నేతల అరెస్టులపై మండిపడ్డ పిసీసీ ఛీఫ్ ఉత్తమ్..
ఆ సంఘటన జరిగి 24గంటలు గడవక ముందే గురువారం సంగారెడ్డి జిల్లాలోని మంజీరా డ్యామ్ పరిశీలనకు వెళ్లనున్న పిసిసి చీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్ లోని పిసిసి చీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాసం నుండి బయలు దేరిన పలువురు నేతలను ముందస్తు అరెస్టులు చేసేందుకు సిద్దమయ్యారు తెలంగాణ పోలీసులు. పిసిసి చీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్వర్యంలో మంజీరా డ్యాం పరిశీలనకు బయలుదేరిన కాంగ్రెస్ నాయకుల బృందానికి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ఈ సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం పై ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు.
జలదీక్ష పేరుతో ప్రాజక్టుల సందర్శన.. కాంగ్రెస్ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు..
జలదీక్ష పేరుతో ప్రాజక్టుల పరిశీలనకు వెళ్తోన్న కాంగ్రెస్ నాయకులను అడ్టుకోవటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఉత్తమ్ తెలిపారు. ప్రాజక్టుల పరిశీలనతో పాటు నిర్మాణ పనులు ఎంతవరకు పూర్తయ్యాయో తెలుసుకోవడం కాంగ్రెస్ పార్టీ హక్కు అని ఉత్తమ్ పేర్కొన్నారు. అంతే కాకుండా ప్రభుత్వానికి పోలీసులు తొత్తులుగా మారొద్దని హితవు పలికారు. గోదావరి నీటితో సింగూర్, మంజీరా డ్యాంను నింపుతామని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గతంలో చేసిన వాగ్దానాన్ని మర్చిపోయారని, సొంత జిల్లా ప్రజలను సీఎం పచ్చి మోసం చేస్తున్నారని ఉత్తమ్ మండిపడ్డారు.
ప్రభుత్వ బండారం బయటపడుతుంది.. అందుకే అడ్డుకుంటుందన్న ఉత్తమ్..
లాక్డౌన్ ఆంక్షల సమయంలో త్రిదిండి చిన్నజీయర్ స్వామితో కలసి దాదాపు పది వేల మందితో సీఎం చంద్రశేఖర్ రావు కొండపోచమ్మ ప్రాజెక్ట్ ను ఎలా ప్రారంభిస్తారని ఉత్తమ్ ప్రశ్నించారు. కల్వకుంట్ల కుటుంబానికి ప్రత్యేక చట్టాలున్నాయేమో డీజీపీ సమాధానం చెప్పాలని ఉత్తమ్ డిమాండ్ చేసారు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు జిల్లాల పర్యటనల కోసం పోలీసులు ఎలా అనుమతి ఇస్తున్నారని, కల్వకుంట్ల ప్రైవేటు సైన్యంగా పోలీసులు వ్యవహరించొద్దని ఉత్తమ్ హితవు పలికారు. ప్రాజక్టుల పేరుతో లక్షల కోట్లు ప్రజల డబ్బును దోచుకుంటున్నారని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
Recommended Video
సాగునీటి ప్రాజెక్టుల గురించి ప్రభుత్వానివి ఉత్తుత్తి గొప్పలు మాత్రమే.. క్షేత్ర స్ధాయిలో పరిస్ధితులు విరుద్దంగా ఉన్నాయన్న కాంగ్రెస్..
80శాతం పూర్తైన ఎస్సెల్బీసీ ప్రాజెక్టును ప్రభుత్వం పట్టించుకోవటంలేదని, గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చే ప్రాజక్టుల పూర్తి కోసం ఏమాత్రం శ్రద్ద చూపడం లేదని, వాటికోసం ఒక్క రూపాయిని కూడా చేయటంలేదని ఉత్తమ్ మండిపడ్డారు. సాగునీటి ప్రాజక్టుల గురించి టీఆర్ఎస్ పార్టీ గొప్పలు చెప్పుకుంటోందని. క్షేత్ర స్థాయిలో మాత్రం అందుకు విరుద్దంగా ఉందని స్పష్టం చేసారు. అంతే కాకుండా పటాన్ చెరువు టోల్ ప్లాజా వద్ద మంజీరా డ్యాం సందర్శనకు వెళ్తున్న కాంగ్రెస్ నేతల బస్సు ను అడ్డుకున్న పోలీసులు, ఉత్తమ్ తో పాటు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జట్టి కుసుమ కుమార్, పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి లను అదుపులోకి తీసుకుని బి డి ఎల్ భానూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు.