బాబు మాటను కాదంటున్న ఆ ఎమ్మెల్యే.! పార్టీ మారేందుకే సుముఖత..!!
హైదరాబాద్ : ఆయన ఆ పార్టీ లో సుధీర్ఘకాలం పని చేసారు. పార్టీకి, పార్టీ అధినేతకు నమ్మిన బంటులా పని చేసారు. క్రమశిక్షణ గల నేతగా కూడా ముద్రవేలుకున్నారు. రాష్ట్రం విభజన తర్వాత కూడా పార్టీ పట్ల తన విధేయతను చాటుకుంటూ వస్తున్నారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో కూడా ఎన్నో ఒత్తిడులను అదిగమించి ఎమ్మెల్యేగా విజయం సాదించారు. అసలు కథ ఇక్కడే మొదలైంది. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పని చేస్తున్న ఆ నేతకు పార్టీ మారాల్సిందిగా అనేక ఒత్తిళ్లు వస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ మారకుండా ఉంటే భవిశ్యత్ కనిపించడం లేదు.. పార్టీ మారితే కన్న తల్లిలాంటి పార్టీకి ద్రోహం చేసినట్టు అవుతుందనే రెండు సున్నిత అంశాల పట్ల ఆ నేత నలిగిపోతున్నట్టు సమాచారం. ఏ సెంటిమెంట్ ఎంత బలంగా పనిచేస్తున్నప్పటికి తాను పార్టీ మారేందుకే సుముఖత వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎవరా ఎమ్మెల్యే..? ఏంటా కథ..! తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!!
పార్టీ తరపున మూడు సార్లు ఎమ్మెల్యే..! కాని ఇప్పుడు పార్టీ మారేందుకు సన్నాహాలు..!!
తెలుగుదేశం పార్టీ తరపున మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఓ నేత.. త్వరలోనే ఆ పార్టీకి గుడ్బై చెప్పబోతున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇప్పుడీ వార్త రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అయింది. ఇటీవల తెలంగాణలో ముగిసిన ముందస్తు ఎన్నికల్లో ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన సండ్ర వెంకట వీరయ్య.. టీడీపీకి రాజీనామా చేయబోతున్నారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. దీనిని ఆ పార్టీకి చెందిన నేతలు కొట్టివేసినా, ఇది నిజమేననే చర్చ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో ప్రజాకూటమి పొత్తుల్లో భాగంగా 13 నియోజకవర్గాల్లో పోటీ చేసిన టీడీపీ, కేవలం రెండు చోట్ల మాత్రమే విజయం సాధించిన విషయం తెలిసిందే..!
మోడీ! ఏ మొహం పెట్టుకొని వస్తున్నావ్, చేతులు దులుపుకున్నావ్: చంద్రబాబు నిప్పులు
ఉనికి కోల్పేయే ప్రమాదంలో టీడిపి..! తెలంగాణ లో ప్రాతినిధ్యం కరువు..!
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని టీడీపీ సిట్టింగ్ స్థానం సత్తుపల్లి, అశ్వారావుపేటలోనే టీడిపి విజయం సాదించింది. . సత్తుపల్లి నుంచి సండ్ర వెంకటవీరయ్య, అశ్వారావుపేట నుంచి మెచ్చా నాగేశ్వర్రావు విజయం సాధించారు. వీరిద్దరిపై తెలంగాణ రాష్ట్ర సమితి కన్నేసింది. టీఆర్ఎస్లో చేర్చుకుని, రాష్ట్రంలో ఆ పార్టీ ప్రాతినిధ్యం లేకుండా చేయాలని గులాబీ పార్టీ ప్రణాళిక రచించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇద్దరు ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకోవాలని పట్టుదలతో టీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టు సమాచారం. గులాబీ పార్టీ ప్రతిపాదనకు సండ్ర నుంచి పాజిటివ్ సంకేతాలు వెళ్లినట్టు తెలుస్తోంది.
గెలిచింది ఇద్దరే..! కాని ఎవరి దారి వారిదే ..!!
పార్టీ మారుతున్నట్టు వస్తున్న ప్రచారాన్ని ఖండించిన అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర్రావు చంద్రబాబును కలిశారు. పార్టీని వీడాలన్న ఎవరి ఒత్తిడికీ తలొగ్గాల్సిన అవసరం లేదని, ఏ అవసరమైనా నేరుగా తనను కలవాలని చంద్రబాబు భరోసా ఇచ్చినట్లు ఆయన తెలిపారు. తుదిశ్వాస విడిచేవరకు పార్టీలోనే కొనసాగుతానని ఆయనకు స్పష్టం చేసినట్లు మెచ్చా వివరించారు. అయితే, సండ్ర మాత్రం తనతో టీఆర్ఎస్ నేతలు మంతనాలు జరిపారని, కానీ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు. అంటే పరోక్షంగా తాను పార్టీ మారుతున్నట్లు చెప్పేస్తున్నారు.
చంద్రబాబు బుజ్జగింపు..! ససేమిరా అంటున్న ఎమ్మెల్యే..!!
విషయం తెలిసిన చంద్రబాబు సండ్రతో ఫోన్లో సంప్రదించినట్టు తెలుస్తోంది. టీటీడీ లో సముచిత స్థానం కల్పిస్తానని, భవిష్యత్లో మరింత ప్రాధాన్యత కల్పిస్తానని చంద్రబాబు హామి ఇచ్చినట్టు తెలుస్తోంది. అయినప్పటికి ఈ విషయంలో సండ్ర నిర్ణయం మార్చుకోలేదని సమాచారం. మెచ్చా నాగేశ్వర్రావును తీసుకొస్తే మంత్రి పదవి ఇస్తామని టీఆర్ఎస్ నేతలు హామీ ఇచ్చినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో సండ్ర ప్రవర్తన పలు అనుమానాలు రేకెత్తించింది. ఫైనల్గా ఆయన తెలుగుదేశం పార్టీని వీడేది ఖాయమనే చర్చ తారా స్థాయిలో జరుగుతోంది.