సోదర సోదరీమణుల అనురాగం..! ఈ రాఖీ అనుబంధం...!
హైదరాబాద్ : భారత దేశంలో అన్నా చెల్లెలి అనురాగానికి గుర్తుగా వచ్చే రాఖీ పండుగను దేశంలోని సోదర సోదరీమణులు అత్యంత ఉత్సాహంతో జరుపుకుంటున్నారు. అన్న,తమ్ముడికి హారతి ఇచ్చి, ప్రేమతో రాఖీ కట్టి దీవెనలు పొందుతున్నారు అక్కా చెళ్లెల్లు. సోదరీ రాఖీ కట్టినందుకు సోదరుడు మధురమైన జ్ఞాపకానికి గుర్తుగా ఏదో ఒక బహుమతిని తన సోదరికి ఇచ్చి ఆప్యాయతలను పంచుకుంటున్నారు. దేశంలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే పండగ వాతావరణం కనిపిస్తోంది. ఏ తెలుగు లోగిలి చూసినా సోదరీ సోదరుల ప్రేమ అనురాగంతో పులకించి పోతోంది.
తెలుగు రాష్ట్రాల్లో రాఖీ సంబరాలు..! పండగ వాతావరణంలో సోదర సోదరీమణులు..!!
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అన్నా చెల్లెలి, అక్కా తమ్ముని అనుంధాన్ని చాటి చెప్పే రాఖీకి ఎంతో చరిత్ర, ప్రాధాన్యత ఉంది. రాఖీ కట్టిన సోదరికి తగిన బహుమానం ఇస్తూ సోదరుడు ఆశీర్వదిస్తాడు. రాఖీ పౌర్ణమి, శ్రావణ పూర్ణిమ, జంధ్యాల పూర్ణిమ ఇలా ఎన్నో రకాలుగా దేశమంతా ప్రజలు ఆనందోత్సాహాలతో ఈ పండుగను జరుపుకుంటారు. దేవతలు, ప్రకృతి ఆరాధన, ఆత్మీయత అనురాగబంధాలు, సకల పూజారాధనలు అందుకునే ఈ శ్రావణ పౌర్ణమి. ఈ రాఖీ సోదర ప్రేమ పటిష్టతకు దోహదపడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో తమ సోదరులకు సోదరి రాఖీ కట్టి, మిఠాయిలు తినిపిస్తారు. మనం రాఖీ పండుగను తర తరాలుగా ఇలానే చేసు కుంటూ వస్తున్నాం. ఇది తెలుగు సంస్కృతి కూడా.
అప్యాయంగా రాఖీ కడుతున్న సోదరి..! ప్రేమతో బహుమతి ఇస్తున్న సోదరుడు..!!
ఏడాదికి వచ్చే ద్వాదశ పౌర్ణమిల్లో శ్రావణ పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది. సాధారణంగా జంధ్యాన్ని ధరించేవారు ఈ రోజునే పాతది వదిలి కొత్త దానిని ధరిస్తారు. దీనినే ఉపాకర్మ అంటారు. ఉపాకర్మను యఙ్ఞోపవీతం పేరుతో పిలుస్తారు. దీనికి అంటే యాగ కర్మతో పునీతమైన దారం అని అర్థం. పాల్కురికి సోమనాథుడు దీనిని నూలి పౌర్ణమి అన్నాడు. ఎందుకంటే నూలుతో తయారుచేసిన జంధ్యాన్ని ధరించడమే దీనికి కారణం. వేద్యాధ్యయనానికి ప్రతీకైన ఉపాకర్మను ఆచరించాలి. దీనికి ముందు ఉపనయనం జరిపించి జంధ్యాన్ని వేయడం ఆచారం.
తెలుగు రాష్ట్రాలకు ఎంతో ప్రత్యేకం..! అన్నా చెల్లెళ్ల అనుబంధానికి గుర్తు రాఖీ పండుగ..!!
పురాణాల్లో కూడా ఈ రాఖీ పండుగకు ప్రత్యేక స్థానం ఉంది. యఙ్ఞోపవీతం ధరించినవారు ద్విజులు. ద్విజులు అంటే రెండు జన్మలు కలవారని అర్థం. తల్లి గర్భం నుంచి జన్మించడం మొదటిది కాగా, ఉపనయనం అనంతరం గురువు నుంచి ఙ్ఞానాన్ని పొందడం రెండోది. ఉపనయం సమయంలో యఙ్ఞోపవీతానికి జింక చర్మాన్ని కడతారు.దీనిని ఉపాకర్మ కార్యక్రమంలో శ్రావణ పౌర్ణమి నాడు వదిలిపెడతారు. ఉపనయనం అయిన వారు జంధ్యాల పౌర్ణమి రోజు గాయత్రీ పూజచేసి కొత్త యఙ్ఞోపవీతాన్ని ధరించి పాతది విసర్జించాలి. రాఖీ రోజు ఉదయాన్నే తలార స్నానం చేసి, కొత్త బట్టలు వేసుకుని రాఖీకి సిద్ధపడతారు.
దూర ప్రాంతాల నుంచి వస్తున్న అన్నా చెల్లెళ్లు..! రాఖీ కట్టడమే ముఖ్యం..!!
అక్కచెల్లెళ్లంతా బుద్ధిగా కూర్చున్న అన్నదమ్ములకి రాఖీని కడతారు. రాఖీని కట్టేటప్పడు `యేన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః తేన త్వామభి బధ్నామి రక్షమాచల మాచల` అనే స్తోత్రాన్ని కూడా చదువుతారు. `ఎలాగైతే ఆ విష్ణుమూర్తి, బలిచక్రవర్తిని బంధించాడో, నువ్వు అలాగే ఇతణ్ని అన్ని కాలాలలోనూ విడవకుండా ఉండు` అని దీని అర్థం. ఆ తరువాత హారతిని ఇచ్చి, నుదుట తిలకాన్ని దిద్దుతారు. ఈ పండుగ రక్తం పంచుకుని పుట్టిన సోదరుల మధ్యే కాదు. అది ఏ బంధుత్వం ఉన్నా లేకపోయినా, ఒక సోదరుడు, సోదరి భావనలతో రాఖీ కట్టడం జరుగుతోంది. కేవలం సోదరీసోదరుల అనుబంధానికి గుర్తుగా మాత్రమే కాకుండా ఆత్మీయుల మధ్య కూడా ఐకమత్యానికి పరస్పర సహకారానికి చిహ్నంగా చేసుకోవడం కనిపిస్తుంది.