చినుకు పడితే వణుకే..! నరకాన్ని తలపిస్తున్న నగరం..!!
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో డ్రైనేజ్ వ్యవస్థ దారుణంగా తయారయ్యిందనే చర్చ జరుగుతోంది. చినుకుపడితే నగర వాసుల పని చిత్తడి కావల్సిందేననే సెటైర్లు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టే గత నెల రోజులనుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు నగర ప్రజల జీవనాన్ని అతలా కుతలం చేస్తున్నాయి. అంతే కాకుండా లోతట్టు ప్రాంతాల ప్రజల నివాసాలను జల దిగ్బందంలోకి నెట్టేస్తున్నాయి భారీ వర్షాలు. ఘనమైన చరిత్ర ఉందని చెప్పుకుంటున్న హైదరాబాద్ కు కనీసం డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం నగర ప్రజలను అసహనానికి గురిచేస్తోంది.
హుజూర్నగర్ లో ఈసారి గులాబీ పార్టీ గురి తప్పదా..? కేసీఆర్ మాస్టర్ ప్లాన్ ఇదేనా..?
పేరుకే విశ్వ నగర్..! చినుకు పడితే నగరం నరకమే..!!
హైదరాబాద్ లో డ్రైనేజ్ వ్యవస్థ బాగు పడాలంటే 425సంవత్సరాలు వెనక్కు వెళ్లాలనే అభిప్రాయాన్ని నగర వాసులు వ్యక్తం చేస్తున్నారు. వంద సంవత్సరాల క్రితం అంటే 1908లో హైదరాబాద్ లో కురిసిన భారి వర్షాలు, వరదలకు అప్పట్లో వర్షం నీరు ఎక్కడా ఇళ్లల్లోకి వచ్చిన దాఖలాలు లేవనే చర్చ జరుగుతోంది. నాలా వ్యవస్థ పకడ్బందీగా ఉండడంతో ఎక్కడా నీళ్లు నిలవకుండా నదుల్లోకి వెళ్లిపోయాయని ప్రత్యక్ష్య సాక్షులు గుర్తు చేస్తున్నారు. అలాంటి వ్యవస్థ మళ్లి రావాలంటే వెనక్కి వెళ్లక తప్పదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఎడతెరిపి లేని వర్షాలు..! బెంబేలెత్తుతున్న నగర వాసులు..!!
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు నగరం బెంబేలెత్తి పోతోంది. లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకుపోతున్నాయి. లోతట్టు ప్రాంతాలే కాకుండా సాధారణ సల్లపు ప్రాంతాలు కూడా జలమయమవ్వడాన్ని నగర ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా సరికొత్త డ్రైనేజి వ్యవస్ధకు శ్రీకారం చుడుతామని ప్రకటనలు గుప్పించి తర్వాత చేతులెత్తేసినట్టు చర్చ జరుగుతోంది. కొద్ది వర్షానికే నగర రోడ్లు జలమయమవ్వడం గత ప్రభుత్వాల నిర్లక్ష్యమే అని చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరున్నరేళ్లుగా ఏం చేసిందనే ప్రశ్నలను సంధిస్తున్నారు నగర వాసులు. ఆరున్నరేళ్లలో కనీసం డ్రైనేజి వ్యవస్ధను కూడా పునరుద్దరించలేక పోయారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
లోతట్టు ప్రాంతాలే కాదు..! సాధారణ ప్రాంతాలు కూడా జలమయమే..!!
హైదరాబాదులో కుండపోత అంటే ఎలా ఉంటుందో వరుసగా మూడు రోజుల నుంచి రుచిచూపిస్తున్న వరుణుడు నగర వాసులను బెంబేలెత్తిస్తున్నాడు. రోడ్లు కాలువలు అయ్యాయి. అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా లోతట్టు ప్రాంతాలన్నీ జల దిగ్బంధంలో మునిగిపోయాయి. జన జీవనం స్తంభించింది. కొన్ని వందల మంది రోడ్ల మీద గుంతల్లో పడి గాయాలపాలయ్యారు. రవాణా పూర్తిగా స్తంభించింది. గుంతలపై అడుగు కంటే ఎక్కువ ఎత్తులో నీరు పారుతుండటంతో కార్లు వెళ్లలేకపోతున్నాయి. ధైర్యం చేసి వెళ్తే కార్ల సెలైన్సర్లలోకి, కారులోకి నీరు పోయి ఒక్కో వాహనదారులకు వేలల్లో నష్టం వాటిల్లుతోంది. గత దశాబ్దకాలంగా ఎన్నో వానలు వచ్చినా, ఇలా మూడు రోజుల పాటు కుండపోత వాన ఎపుడూ పడలేదు. పడినా రోడ్లు చెరువులను తలపించినట్టు ఎన్నడూ తలపించలేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
వర్షాలతో జనజీవనం అస్ధవ్యస్ధం..! చోద్యం చూస్తున్న ప్రభుత్వ యంత్రాంగం..!!
తాజాగా కురుస్తున్న వర్షాల వల్ల ఇళ్లలోనే కాకుండా ప్రభుత్వ ఆఫీసులు, పోలీసు స్టేషన్లు కూడా మునిగిపోయాయి. నాచారం పోలీసు స్టేషను, పంజాగుట్ట పోలీసు స్టేషనుతో పాటు ఆసుపత్రుల్లోకి కూడా నీరు చేరిపోయింది. లోతట్టు ప్రాంతాలనే కాదు, సాధారణ లెవెల్ లో ఉన్న ప్రాంతాల్లోనూ వరద ముంచెత్తింది. చాలాచోట్ల కిలోమీటరు ప్రయాణానికి అరగంట నుంచి గంట సమయం పడుతున్న దుస్థితి నగరంలో నెలకొంది. దీంతో ఇళ్లకు ఎలా చేరాలో తెలియక జనం అనేక అవస్థలు పడ్డట్టు తెలుస్తోంది. అంతే కాకుండా నీటితో నిండిన రోడ్లపై ఓ యువకుడు మ్యాన్ హోల్ లో పడి చనిపోయాడు. ఐనప్పట్టికి ప్రభుత్వ యంత్రాంగం నుండి స్పష్టమైన ప్రకటన రాకపోవడం శోచనీయం అంటున్నారు నగర ప్రజలు.