వర్షం పడితే బురద.. వర్షం ఆగితే దుమ్ము, ధూళి..! నగరంలో దారుణంగా తయారైన రోడ్ల పరిస్థితి..!!
హైదరాబాద్: నగరంలో రహదారులు విచిత్రంగా తయారయ్యాయి. వర్షం పడితే ఒక నరకం, పడకపోతే మరో నరకంగా తాయారయ్యాయి రోడ్ల పరిస్థితి. వర్షం పడితే రోడ్లన్నీ బురద మయం.. వర్షం ఆగిపోతే దమ్మూ ధూళీ తో నగరంలో ప్రయాణం నరకంగా మారుతోంది. ఇదీ గ్రేటర్ హైదరాబాద్లోని రోడ్ల పరిస్థితి. రెండు, మూడు రోజులుగా వర్షాలు పడకపోవడంతో రోడ్లన్నీ దుమ్ము రేగుతున్నాయి. వర్షాలకు గుంతలమయంగా మారిన రోడ్లపై ప్రయాణం నరకంగా మారిందని నగర వాసులు వాపోతుంటే, దానికి తోడు దుమ్ము, ధూళి వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయంటున్నారు. పేరుకే బీటీ, సీసీ రోడ్డు. అవి మట్టి రహదారులకంటే అధ్వానంగా ఉన్నాయి. సాధారణంగా నగరంలో దుమ్ము, ధూళి కణాల తీవ్రత నిర్ణీత స్థాయిని దాటి ఉంటోంది.
దుమ్ము రేగుతున్న నగర రోడ్లు..! వర్షం వస్తే నీటి గుంతల మయం..!!
తాజాగా వర్షాలు వెలిసిన తర్వాత మరోసారి పెద్ద మొత్తంలో దుమ్ము, ధూళి కణాలు నగర రోడ్లను మేఘాల్లా కమ్ముకుంటున్నాయి. దీంతో రహదారులపై ప్రయాణించే వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నిత్యం రోడ్లపై తిరిగే లక్షలాది వాహనాలతో పొగ కాలుష్యం తీవ్రంగా ఉందంటే దానికి తోడు దమ్ము, ధూళి నగర వాసులపై ప్రభావం చూపుతోంది. ప్రధాన రహదారులే కాకుండా అంతర్గత రోడ్లపై కూడా ఇలానే ఉన్నాయని వాహనదారులు వాపోతున్నారు. తరచూ ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్లపై తవ్వకాలు చేపడుతున్నారు. దీంతో మట్టి రోడ్లపైకి వస్తోంది. వర్షాలు కురిసినప్పుడు బురదమయంగా మారుతోంది. వర్షాలు వెలిసిన తర్వాత దుమ్ము లేస్తుండడంతో ప్రయాణించాలంటే వాహనదారులు భయపడుతున్నారు. దీనికితోడు వాహన కాలుష్యంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వర్షా కాలంలో రోడ్ల తవ్వకాలు నిషేధం అని చెబుతున్నా, అది ప్రకటనలకే పరిమితమైనట్టు తెలుస్తోంది. అంతర్గత రోడ్లపై ఉండే మట్టితో దుమ్ము రేగడంతో సమీపంలో నివసిస్తున్న వారు ఇబ్బందులు పడుతున్నారు.
కోట్లు ఖర్చు చేసినా మెరుగుపడని రోడ్లు..! దుమ్ము, ధూళితో ఆరోగ్య సమస్యలు..!!
హైదరాబాద్ మహానగరంలో రోడ్ల నిర్మాణం కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. నాణ్యతా లోపం కారణంగా వర్షాలకు తారు రోడ్లన్నీ పాడై గుంతలమయంగా మారుతున్నాయి. కంకర, ఇసుక తేలుతున్నాయి. కోట్ల రూపాయల నిధులు వృథా అవుతున్నాయి. ఓ వైపు నగరంలో వాయు కాలుష్యంపై పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా, నివారణ కోసం చేపడుతున్న చర్యలు శూన్యం. సూక్ష్మ ధూళి రేణువులు పీల్చే గాలి ద్వారా నేరుగా ఊపిరి తిత్తుల్లో చేరడంతో ప్రజలు శ్వాసకోశ, పొడిదగ్గు తదితర వ్యాధుల బారిన పడుతున్నారు.
మాస్క్ ధరిస్తే రక్షణ..! అంతర్గత రహదారులను పట్టించుకున్న నాథుడే లేడు..!!
నగర రోడ్ల పైన గాలికి, వాహనాల తాకిడికి పైకి లేస్తున్న దుమ్ము దూళి కణాల వల్ల అసహనం, చికాకు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. తలనొప్పి వస్తుంది. ధూళి కాలుష్యం మోతాదు పెరుగుతుంటే ఊపిరితిత్తుల కేన్సర్లు పెరిగే ప్రమాదం ఉంది. వాయు కాలుష్యం గుండె కవాటాలను పెద్దవిగా చేస్తాయని వైద్యులు అంటున్నారు. కవాటాల సైజు పెరితే గుండె జబ్బులపై ప్రభావం ఉంటుందంటున్నారు. వాహనాల నుంచి వెలువడే నైట్రిక్ ఆక్సైడ్, అతి సూక్ష్మ ధూళి కణాలు మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఆస్పత్రుల్లో మాస్క్లు ధరించినట్లు వాహనాలపై వెళ్లే వారితోపాటు పాదచారులు దుమ్ము, ధూళి కణాల నుంచి రక్షణగా మాస్క్లు ధరించాలి. రోడ్లపై ప్రయాణించే వారు కళ్లద్దాలు పెట్టుకోవడం ద్వారా దుష్ప్రభావాలను కొంతవరకు నివారించవచ్చని వైద్యులు చెబుతున్నారు.
రోడ్లపై ప్రయాణించాలంటే భయపడుతున్న వాహనదారులు..! ఖర్చు చేస్తున్న కోట్ల రూపాయలు వృథా..!!
వైద్యులను సంప్రదించి దుమ్ము, ధూళి కణాల బారిన పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. సంబంధిత విభాగం అధికారులు ప్రధాన రహదారుల్లోనే గుంతలు పూడుస్తున్నారు. అంతర్గత రహదారుల్లో గుంతల విషయాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని పలు బ్లాక్లలో గుంతలు ఏర్పడ్డాయని అధికారులకు ఫిర్యాదు చేస్తే ప్రధాన రహదారి పైన గుంతలు పూడ్చిన తరువాతనే అంతర్గత రహదారుల్లో గుంతలు పూడుస్తామని అంటున్నారు. మరిన్ని ప్రమాదాలు జరగక ముందే గుంతలను పూడ్చాలి. వర్షాకాలం రాకముందే గుంతలు ఏర్పడ్డా వాటిని పూడ్చకపోవడంతో ప్రస్తుతం నగర వాసులు నరకాన్ని చూడాల్సిన పరిస్థితులు తలెత్తాయి.