టీ సర్కార్ కు కోర్ట్ అక్షింతలు..!అశ్వత్థామరెడ్డి అరెస్ట్ డ్రామా..!శనివారం బంద్..! అంతా ఉద్రిక్తమే..!
హైదరాబాద్ : తెలంగాణలో ఉద్రిక్త పరిస్ధితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆర్టీసి సమ్మె తెలంగాణ ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా తయారవ్వగా, హై కోర్ట్ ఘాటు వ్యాఖ్యలు చంద్రశేఖర్ రావు ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇటు గవర్నర్ కూడా సమ్మె అంశానికి సంబందించి ఎప్పటికప్పుడు వివరాలను తెలుసుకోవడంతో ప్రభుత్వం అభద్రతాభావంలో పడిపోయినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఆర్టీసి ఉద్యోగ సంఘాల జేఏసి నేత అశ్వద్దామ రెడ్డి అరెస్టు, ఆ తర్వాత విడుదల చేయడం వంటి అంశాలు కూడా ప్రభుత్వానికి శరాఘాతంలా మారాయి.
తెలంగాణలో ఉద్రిక్త పరిస్థితులు..! ఆర్టీసి సమ్మె పిలుపుతో మారిన సమీకరణాలు..!!
తెలంగాణలో ఉద్యమం నాటి పరిస్ధితులు పునరావృతం అవుతున్నాయి. బంద్ కు ఆర్టీసి ఉద్యోగుల పిలుపు, కార్మిక నేతల అరెస్టులు, ప్రతిపక్షాల ఆరోపణలు, కోర్ట్ అక్షింతలు, గవర్నర్ జోక్యం, తరచూ ప్రమాదాలు కొని తెస్తున్న తాత్కాలిక డ్రైవర్లు, బందును ఎలా ఎదుర్కోవడం వంటి అంశాలతో తెలంగాణ సర్కార్ నలిగిపోతున్నట్టు తెలుస్తోంది. ఆర్టిసీ కార్మికుల సమ్మె, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఉద్యోగులు సెల్ప్ డిస్మిస్ అయ్యారంటే ప్రకటన మరింత ఉద్రిక్త పరిస్దితులకు దారి తీసింది. ఆర్టీసి కార్మికుల సమ్మెకు వివిధ పార్టీల నుండి, వివిధ ఉద్మోగ సంఘాల నుండి మద్దత్తు పెరగడం కూడా ప్రభుత్వానికి ఇబ్బందిగా మారినట్టు తెలుస్తోంది.
రోజురోజుకూ ఉదృతంగా మారుతున్న సమ్మె..! తగ్గేది లేదంటున్న ఆర్టీసి ఉద్యోగులు..!!
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు ఏ ముహుర్తంలో సమ్మెను ప్రారంభించారో గానీ రోజురోజుకూ ఉదృతమవుతూనే ఉంది కానీ తగ్గిని పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. మూడు నాలుగు రోజుల్లో ముగిసిపోతుందని భావించిన సమ్మె కాస్తా ఏకంగా పద్నాలుగో రోజులోకి చేరుకుంది. మొదట్లో కాస్త ఆచితూచి మాట్లాడిన ఆర్టీసీ జేఏసీ నేతలు ఇప్పుడు గొంతు సవరించుకోవటమే కాదు , సీఎం చంద్రశేఖర్ రావు మీద ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజ్యాంగ సంక్షోభం వచ్చే ప్రమాదం ఉందన్న మాటలతో పాటు, ఉద్యమాన్నిహింసాత్మకంగా మార్చి ఆ నెపాన్ని ఉద్యోగుల మీదకు నెట్టి, ఉద్యమాన్ని అణచి వేసేందుకు చంద్రశేఖర్ రావు ప్రణాళిక రిచిస్తున్నారని ఉద్యోగ సంఘాల జేఏసి నేత అశ్వధ్దామ రెడ్డి ఒక్కసారిగా సంచలన వ్యాఖ్యలు చేసారు.
ప్రభుత్వానికి హైకోర్ట్ ప్రశ్నల వర్షం..! ఉక్కిరి బిక్కిరవుతున్న టీ సర్కార్..!!
ఇప్పటికే ఆర్టీసీ సమ్మెతో పాపులర్ అయిన ఆయన, ఇప్పుడు మరింత దూకుడుగా వ్యాఖ్యలు చేయటం ఆసక్తికరంగా మారింది. శనివారం తలపెట్టిన తెలంగాణ బంద్ కు ముందస్తుగా ఈ రోజు బైక్ ర్యాలీలతో పాటు, మరిన్ని ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్న తరుణంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ గా వ్యవహరిస్తున్న అశ్వత్థామరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. రేపటి బంద్ ను సక్సెస్ చేయాలని కోరుతూ బైక్ ర్యాలీని నిర్వహించేందుకు సన్నద్దం అవుతున్న అశ్వధ్దామ రెడ్డిని సుందరయ్య విజ్ఞాన కేంద్రం దగ్గర పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ పరిణామంతో వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.
శనివారం బంద్ పైనే అంతా ఫోకస్..! నేతల హౌస్ అరెస్టులకు ప్రభుత్వం ప్లాన్..!!
రేపు నిర్వహించతలపెట్టిన తెలంగాణ బంద్ కు ముందుగా ఆర్టీసీ జేఏసీలో ముఖ్యమైన అశ్వత్థామరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఉద్యోగుల్లోని భావోద్వేగాలను రెచ్చగొట్టినట్టవుతుందని భావించి సర్కార్ తర్వాత ఆయనను విడుదల చేసింది. ఇప్పటికే సమ్మె విషయంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తీసుకున్న నిర్ణయాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోర్టు కూడా సమ్మె అంశంలో గులాబీ పార్టీని కడిగిపారేస్తోంది. కోర్టు అడిడిన ప్రశ్నలకు ప్రభుత్వం నీళ్లు నమలడం తప్ప మరో దారి కనిపించని పరిస్ధితులు తలెత్తాయి. ఆర్టీసీ సమ్మె తో మొదలైన ప్రభుత్వం వ్యతిరేక పరిణామలు ఒక్కొక్కటిగా చంద్రశేఖర్ రావు మెడకు గుదిబండగా పరిణమించబోతున్నట్టు తెలుస్తోంది.