మాజీ ఎంపీ కవితకు అస్వస్థత.. యశోద ఆస్పత్రిలో చేరిక
హైదరాబాద్ : ప్రతిపక్షాలు గొంతుచించుకుని చెప్తున్న విషయం తెలంగాణలో నిజమే అనిపిస్తోంది. పారిశుద్యం లోపించి, దోమలు వ్యాప్తి చెందడం వల్ల ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ గత కొద్ది రోజులుగా చెప్తూ వస్తోంది. అంతే కాకుండా తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌళిక సదుపాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించి తెలంగాణలోని అన్ని జిల్లాలను పర్యటించారు కాంగ్రెస్ పార్టీ నేతలు.
ఆసుపత్రుల్లో కనీప వసతులు లేక రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విపలమైందని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. అంతే కాకుండా తెలంగాణ జిల్లాల్లోనే కాకుండా జంటనగరాల్లో పారశుద్యం లోపించి దోమలు విపరీతంగా వ్యాపిస్తున్న కనీస చర్యలు తీసుకునే పరిస్ధితిలో ప్రభుత్వం లేదని పెద్ద యెత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. దోమ కాటు వలన విష జ్వరాలు ప్రభలుతున్నాయని, దోమల నివారణకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ.
ఐతే తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేకర్ రావు కూతురు కల్వకుంట్ల కవిత కూడా దోమ కాటుకు గురయ్యారు. దాంతో ఆమెకు విష జ్వరం సోకినట్టు తెలుస్తోంది. చికిత్స కోసం కవిత స్థానిక ఆసుపత్రిలో చేరినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో విషజ్వరాలు స్వైరవిహారం చేస్తున్నాయనడంలో ఇంతకంటే ఆధారం ఇంకేంకావాలి అనే భావన కలుగుతోంది. ఈ వైరల్ ఫీవర్ స్వయానా చంద్రశేఖర్ రావు కూతురినే వదలలేదు. కవిత విష జ్వరంతో మంగళవారం సాయంత్రం ఆమె సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేరారు.
బుధవారం ఐటీ మరియు మున్సిపల్ శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆస్పత్రికి వెళ్లి తన సోదరిని పరామర్శించారు. ఆస్పత్రిలో 20 నిమిషాలపాటు గడిపిన కేటీఆర్ కవితతో మాట్లాడారు. వైద్యులను అడిగి ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆస్పత్రికి వెళ్లారు. కూతురిని పరామర్శించిన సీఎం కాసేపు డాక్టర్లతో వివరాలు అడిగి తెలుసుకుని వెళ్లి పోయారు. దోమ కాటు వల్ల ఇలాంటి జ్వరాలు వస్తాయని, ఆందోళన చెందిల్సిన అవసరం లేదని డాక్టర్లు పేర్కొనడం కొస మెరుపు.