కేసీఆర్కు సంకటం..! కాళ్లు మొక్కిన గవర్నర్తో కయ్యం తప్పదా..!?
హైదరాబాద్: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదే. పాలనా సౌలభ్యం కోసం కొత్త మున్సిపల్ చట్టాన్ని తీసుకొచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి ఆదిలోనే హంసపాదులా పరిణమించాయి పరిస్థితులు. చట్టంలో లొసుగులు ఉన్నాయని, ఆమోదిస్తే రాజ్యాంగ స్పూర్తికి విరుద్దంగా ఉంటుందని గవర్నర్ నిరసింహన్ కొత్త చట్టాన్ని తిరిగి వెనక్కి పంపించారు. ఇదే అంశం పై భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ ఘాటుగా స్పందించింది. ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడని బిల్లుకు రూపకల్పన చేసి తెలంగాణ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని విమర్శిస్తున్నారు కమలం నేతలు.
మున్సిపల్ బిల్లులో అన్నీ తప్పులే..! ఆమోదం తెలపొద్దని గవర్నర్ ను కోరతామన్న బీజెపి..!!
ఆఘ మేఘాల మీద తయారు చేసిన కొత్త మున్సిపల్ బిల్లు రాజ్యాంగ నిబంధనల వ్యతిరేకంగా ఉందని దత్తత్రేయ నేతృత్వంలో బీజేపీ నేతలు గవర్నర్ కు ఫిర్యాదు చేసారని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావు తెలిపారు. గవర్నర్ బిల్లు వెనక్కి పంపినా సీఎం తీరులో ఎలాంటి మార్పు లేదని విమర్శించారు. రాజకీయ లబ్ది కోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చారని ఆరోపించారు. ఆర్డినెన్స్ ఎప్పుడు చేయాలో కేసీఆర్ కు తెలియనట్లు ఉందన్నారు. పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు. ఆర్డినెన్స్ ద్వారా చట్టం తేవాల్సిన అవసరం ఏముందని విమర్శించారు. విస్తృత స్థాయి ప్రజా ప్రయోజనం ఉండి, రెండు సభలు నిర్వహించలేని పరిస్థితి లో గాని, ఎమర్జెన్సీ సమయంలో ఆర్డినెన్స్ తీసుకువస్తారని చెప్పారు.
గవర్నర్ వర్సెస్ తెలంగాణ సర్కార్..! ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్న టీఆర్ఎస్..!!
ఇప్పుడు ఆ పరిస్థితి రాష్ర్టంలో ఉందా అని ప్రశ్నించారు. ఈ బిల్లు లో ప్రజా ప్రయోజనాలు లేవని, టిఆర్ఎస్ లబ్ది మాత్రమే ఉందన్నారు. ప్రజా ప్రతినిధుల ప్రాధాన్యత తగ్గిస్తూ, అధికారుల ప్రాధాన్యత పెంచడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆర్డినెన్స్ ను పాస్ చేయోద్దని గవర్నర్ కు లేఖ రాస్తామన్నారు. ఆర్డినెన్స్ చేయాల్సింది గవర్నర్, సీఎం కాదు...సీఎం సలహా మాత్రమే ఇవ్వాలని తెలిపారు. క్యాబినెట్ భేటీ లేకుండా ఆర్డినెన్స్ ఎలా ఇస్తారన్నారు. ఈ అనైతిక చర్య కు గవర్నర్ బాధ్యుడు కావోద్దని కోరుతున్నామని తెలిపారు. సీఎస్, మిగతా ఐఏఎస్, ఐపీఎస్ లు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాజ్యాంగ విరుద్ధంగా బిల్లు ఏలా తయారు చేస్తారన్నారు. ఈ బిల్లు ఐఏఎస్ రూపోందిన బిల్లు లా లేదని, తెలంగాణ భవన్ రాజకీయ నేతలు రాసినట్లు ఉందన్నారు.
ఆదిలోనే హంస పాదు..! కొత్త మున్సిపల్ చట్టానికి గవర్నర్ బ్రేకులు..!
ఇటివలే కొత్త మున్సిపల్ చట్టం 2019 ప్రవేశపెట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వం దాని ప్రకారమే రాబోయే ఎన్నికలకు వెళ్లాలని భావించింది. దీని కోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించగా...ఉభయ సభలలో ఆమోదం పొందింది. అయితే ఈ బిల్లును గవర్నర్ ఆమోదిస్తే ఇక ఆ బిల్లు చట్టం రూపం దాల్చి, నూతన మున్సిపల్ చట్టం ప్రకారమే మున్సిపల్ ఎన్నికలకు వెళ్ళాల్సి ఉండేది. అయితే ఈ బిల్లు గవర్నర్ నరసింహన్ వెనక్కి పంపడంతో చంద్రశేఖర్ రావు సర్కార్కు ఎదురుదెబ్బ తగిలినట్లయింది ఇక . తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నూతన మున్సిపల్ చట్టానికి గవర్నర్ నరసింహన్ పలు అభ్యంతరాలు తెలిపారు.
ఆమోద ముద్రకు గవర్నర్ నో..! ఆర్డినెన్స్ రూపంలో చట్టాన్ని అమలుచేసుకోనున్న టీ సర్కార్..!!
గవర్నర్ ఆమోదముద్ర వేయడానికి నిరాకరిస్తూ వెనక్కి పంపారు. మున్సిపల్ చట్టానికి పలు సవరణలు సూచించారు. ఎన్నికల తేదీ ఖరారు ప్రభుత్వ పరిధిలో ఉండటంపై గవర్నర్ అభ్యంతరం తెలిపారు. ప్రజాప్రతినిధుల తొలగింపు అధికారం కలెక్టర్లకు అప్పగించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. గవర్నర్ సూచనలతో మున్సిపల్ చట్టంపై ఆర్డినెన్స్ తీసుకొచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. నూతన చట్టం ప్రకారమే ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆర్డినెన్స్లో పేర్కొన్న అంశాలను శాసనసభ మరోసారి సమావేశమై ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఇప్పటికే పేర్కొన్న అంశాలతో బిల్లును యథావిధిగా గవర్నర్ ఆమోదం కోసం పంపితే.. ఆ సందర్భంలో ఆయన తప్పనిసరిగా ఆమోదించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియకు తెలంగాణ బీజేపి అడ్డు తగులుతున్నట్టు తెలుస్తోంది.