ఆర్టీసి భవితవ్యం తేలేది నేడే..! హైకోర్ట్ లో కీలక విచారణ..!!
హైదరాబాద్ : తెలంగాణలో ఆర్టీసి సమ్మె ఉగ్రరూపం దాల్చింది. ఛలో ట్యాంక్ బండ్ కార్యక్రమం హింసాత్మకంగా మారడంతో కార్మికులు సమ్మె పట్ల మరింత పట్టుదలగా ఉన్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా తెలంగాణ హైకోర్ట్ లో నేడు కీలక విచారణ జరగనున్న నేపథ్యంలో తమకు ఖచ్చితంగా అనుకూల తీర్పు వస్తుందని కార్మికులు భరోసా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం న్యాయం చేయకపోయినా హైకోర్ట్ తమకు న్యాయం చేస్తుందని జేఏసి నేతలు స్పష్టం చేస్తున్నారు. కోర్టులో ప్రభుత్వం ఎలాంటి వాదనలు వినిపించినా న్యాయం తమవైపు ఉందని ఆర్టీసి ఉద్యోగులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
కేసీఆర్ డెడ్ లైన్ ను లైట్ గా తీసుకున్న ఆర్టీసి కార్మికులు..! సీఎం తర్వాత వ్యూహం ఏంటి..?
ఆర్టీసి పట్ల హైకోర్టు లో విచారణ నేడే.. కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ..
ఆర్టీసి కార్మికులు చేస్తున్న సమ్మె 39వ రోజుకు చేరింది. ఉద్యోగులు, ప్రభుత్వానికి మధ్య ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. అమలు కాని డిమాండ్ ను ప్రభుత్వం ముందు ఉంచి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆర్టీసి జేయేసీ నేతలపై ప్రభుత్వం ఆగ్రహంతో ఉంది. ప్రభుత్వ వైఖరి వల్ల అధైర్యపడకుండా న్యాయస్థానం ద్వారా న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని ఆర్టీసి ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. అందుకు తగ్గట్టే ఆర్టీసీ భవితవ్వం నేడు తేలనున్నది. సోమవారం హైకోర్టులో ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం, కార్మికుల తరఫున విచారణ జరగనుంది.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కౌంటర్ దాఖలు చేయనున్న ప్రభుత్వం.. విచారణ ఎవరికి అనుకూలమో..?
ప్రైవేటు పర్మిట్ లపై కూడా విచారణ జరపనుంది. గత విచారణ సందర్బంగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, సమస్యను పరిష్కారించాలని హైకోర్టు సూచించింది. లేదంటే తామే మరో తీర్పు ఇస్తామన్న హైకోర్టు ఇదివరకే ప్రకటించింది. ప్రైవేటు పర్మిట్ల పై స్టే కొనసాగుతోంది. ఆర్టీసీ సమ్మె, ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయనుంది. సోమవారం జరగబోయే విచారణ పట్ల ఆర్టీసి కార్మికులు పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. సోమవారం జరగబోయే విచారణ తమకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉందని కార్మికులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అమెనికాలో టీఆర్ఎస్ కు ఆర్టీసి సెగ... బోయినపల్లి వినోద్ కుమార్ కు చేదు అనుభవం..
ఆర్టీసి కార్మికుల సమ్మె దేశ సరిహద్దులు దాటింది. విదేశాల్లో ఉన్న తెలుగువారు సైతం ఆర్టీసి కార్మికులు చేస్తున్న సమ్మె, ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానాలపట్ల స్పందింస్తునానరు. కార్మిక లోకం పట్ల ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కర్కషంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీ లో జరుగుతున్న తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం (టీడీఎఫ్) వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కు నిరసన సెగ తగిలింది. అక్కడ నివసిస్తున్న తెలంగాణ పౌరులు ఆర్టీసి సమ్మె పట్ల, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పట్ల ఆయనను నిలదీసారు.
సేవ్ ఆర్టీసీ అంటూ పెద్ద పెట్టున నినాదాలు.. ఆర్టీసిని కాపాడుతామని వినోద్ హామీ..
టీడీఎఫ్ 20 సంవత్సరాల వేడుకల్లో వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన ప్రసంగించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో కొందరు తెలంగాణ పౌరులు లేచి నిల్చుని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. సేవ్ ఆర్టీసీ అంటూ నినదించారు. కొద్దిసేపు టీఆర్ఎస్ అభిమానులు, తెలంగాణ ఎన్ఆర్ఐ లకు మధ్య వాగ్వాదం జరిగింది. రెండు దశాబ్ధాల క్రితం మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ ఆర్టీసీ ప్రైవేటీకరణ చేశారని వినోద్ తెలిపారు. ప్రైవేటీకరణకు తెరలేపింది కాంగ్రెస్ నాయకులేనని ఆయన విమర్శించారు. అయినా తెలంగాణలో ఆర్టీసీని కాపాడతామని ఆయన హామీ ఇచ్చినప్పటికీ నినాదాలు సద్దుమణగలేదు. దీంతో వినోద్ వేడుక నుండి నిష్క్రమించే పరిస్ధితులు తలెత్తాయి.