ఎర్రబెల్లి నోటి దురద..!ఆర్టీసి సమ్మె పై అనుచిత వ్యాఖ్యలు..!మండిపడుతున్న కార్మికులు..!!
హైదరాబాద్ : కందకు లేని దురద కత్తికెందుకు అనే సామెత ఊరికే రాలేదు. కొంత మంది నోటి దురద వల్ల, సంబంధం లేని అనుచిత వ్యాఖ్యల వల్ల ఇలాంటి సామెత పుట్టుకొచ్చినట్టు తెలుస్తోంది. తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అచ్చం ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఇరుకునపడే పరిస్థితులను కొని తెచ్చుకున్నారు. తనకు గాని, తన శాఖకు గాని ఎలాంటి సంబంధం లేని అంశం గురించి ప్రస్థావిస్తూ ఇబ్బందుల పాలయ్యే ప్రమాదంలో పడ్డారు. ఆర్టీసి కార్మికులు చేస్తున్న సమ్మె పట్ల అటు హరీష్ రావు గాని, ఇటు కేటీఆర్ గాని ఇంతవరకూ బహిరంగ ప్రకటన చేయలేదు. సున్నితమైన అంశం పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అలాంటిది కొత్తగా పార్టీలోకి వచ్చిందే కాకుండా, కొత్తగా మంత్రి పగ్గాలు చేపట్టిన ఎర్రబెల్లి దయాకర్ మాత్రం ఆర్టీసి సమ్మె గురించి చురుగ్గా స్పందిస్తున్నారు.
ఆర్టీసి భవితవ్యం తేలేది నేడే..! హైకోర్ట్ లో కీలక విచారణ..!!
సంబంధం లేని అంశంలో తల దూర్చిన ఎర్రబెల్లి.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆర్టీసి ఉద్యోగులు..
కొందరు రాజకీయ నాయకులు కొన్ని అనవసరపు అంశాల్లో తల దూర్చి చిక్కులు కొని తెచ్చుకుంటారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు కష్టాలు తెచ్చిపెడుతోందా లేక తానే స్వయంగా కావాలని కష్టాలు కొని తెచ్చుకుంటున్నారా అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. వాస్తవానికి, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, హరీశ్రావు, శ్రీనివాస్గౌడ్ తదితర మంత్రులెవరూ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ఎక్కడా మాట్లాడడం లేదు. సున్నితమైన అంవం పట్ల స్పందిస్తే ప్రభుత్వానికి ఎక్కడ చెడుపేరు వస్తుందోనని సైలెంట్గా ఉంటున్నారు.
ఎర్రబెల్లికి అవసరంలేని అంశం.. పని చూసుకోవాలంటున్న కార్మికులు..
కానీ పంచాయతీ రాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాత్రం సమ్మె పట్ల తరచుగా స్పందింస్తున్నారు. అది కూడా కార్మికులకు సంఘీభావంతో కాకుండా ఉద్యోగులను మరింత రెచ్చగొట్టేలా ఘాటుగా స్పందిస్తున్నారు. సమ్మెకు ప్రజల మద్దతు లేదని, యూనియన్ల మాయ నుంచి బయటకు రావాలని ఎర్రబెల్లి ఇటీవల అనుచిత వ్యాఖ్యలు కూడా చేసారు. దీనిపై తెలంగాణ వ్యాప్తంగా మంత్రి ఎర్రబెల్లిపై కార్మిక లోకం మండిపడుతోంది. మంత్రి హోదాలో ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతోందా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆర్టీసి ఉద్యోగులు.
హరీష్, కేటీఆర్ కు లేని దురద ఎర్రబెట్టికి ఎందుకు..? సూటిగా ప్రశ్నిస్తున్న కార్మికులు..
తెలంగాణ ఉద్యమ సమయంలో ఎర్రబెల్లి దయాకర్రావు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఆయన అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. గత ముందస్తు గులాబీ పార్టీ తరుపున ఎన్నికల్లో గెలిచి మంత్రి అయ్యారు. అయితే, తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి ఉన్నవాళ్లకు మంత్రి పదవి ఇవ్వకుండా ఎర్రబెల్లి దయాకర్ కు ఇవ్వడంపై ఉమ్మడి జిల్లా గులాబీ నేతలు ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి ఎర్రబెల్లే పూర్తి స్థాయిలో చక్రం తిప్పుతున్నారు. ఆయన లేనిది ఏ కార్యక్రమం కూడా నిర్వహించలేని పరిస్థితులు నెలకొన్నాయి.
కార్మికుల ఆగ్రహానికి గురౌతున్న ఎర్రబెల్లి.. హర్షం వ్యక్తం చేస్తున్న వ్యతిరేక వర్గం..
అంతే కాకుండా పార్టీ కార్యక్రమం అయినా, ప్రభుత్వ కార్యక్రమం అయినా, ఆయన ఉండాల్సిందే. ఇలా రోజురోజుకూ ఎర్రబెల్లి తన ప్రభావాన్ని పెంచుకున్నారు. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లా గులాబీ ఎమ్మెల్యేలు, నేతలు ఎర్రబెల్లి పట్ల ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే క్రమంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పిలుపివ్వడం, వారిని రెచ్చగొట్టేలా ఎర్రబెల్లి వ్యాఖ్యలు చేయడం, దీనిపై అన్నివర్గాల కార్మికులు మండిపడుతుండడంతో జిల్లా గులాబీ నేతలు లోలోపల సంబరాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇదే అదనుగా ఎర్రబెల్లి దయాకర్ రావుని మరింతగా ఇరుకున పడేసేందుకు పలువురు గులాబీ నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏమరుపాటుగా ఉన్నప్పుడే పులిని బంధించాలన్న సూత్రాన్ని వరంగల్ జిల్లా నేతలు తూచా తప్పకుండా పాటిస్తున్నట్టు తెలుస్తోంది.