దేశ రాజకీయాల్లో పెను మార్పులు.. హైదరాబాద్ రెండో రాజధాని! యూటీ దిశగా అడుగులు?
ఢిల్లీ/హైదరాబాద్ : దేశ రాజకీయాల్లో ఊహించని మార్పులు జరగబోతున్నాయా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. దేశ రాజకీయాల్లో మార్పులకు ప్రకృతి కూడా తనవంతు సహకారం అందించడం మరో కొసమెరుపు. ప్రస్తుత దేశ రాజధాని ఢిల్లి కాలుష్యభరితమవ్వడంతో ప్రత్యామ్నాయం దిశగా నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్టు తెలుస్తోంది. దేశం మొత్తంగా అన్ని రాష్ట్రాల బౌగోళిక, వాతావరణ, ప్రకృతి సమతుల్యతలను పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరం రెండవ రాజధానిగా ఎక్కువ ఆమోదయోగ్యంగా ఉన్నట్టు నిర్ధారించినట్టు చర్చ జరుగుతోంది.
టార్గెట్ హైదరాబాద్ అంటున్న కేంద్రం... దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ అమలు నిర్ణయంతో టెన్షన్
దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్.. పావులు కదుపుతున్న కేంద్రం..
దీంతో భాగ్య నగరాన్ని దేశానికి రెండవ రాజధానిని చేసి దేశ రాజకీయాలకు హైదరాబాద్ను కేంద్ర బిందువుగా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపిస్తున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఢిల్లీ తరహాలో లెఫ్టినెంట్ గవర్నర్ కనుసన్నల్లో హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేసేందుకు కూడా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటూ మరెన్నో చిక్కుముడులను పరిష్కరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి హైదరాబాద్ను రెండో రాజధానిగా చేసే ప్రక్రియ అంత కష్టమేమీ కాదనే చర్చ కూడా జరుగుతోంది.
ఢిల్లీ లో లోపించి ప్రకృతి సమతుల్యం.. హైదరాబాదే ఆమోదయోగ్యం అంటున్న అధికారులు..
దేశ రాజధాని ఢిల్లిలో నెలకొన్న కాలుష్యం రాజకీయ పెను మార్పులకు కారణమవుతోంది. అంతే కాకుండా దేశం మొత్తంగా చూసుకుంటే, దేశానికి సెంటర్ పాయింట్గా ఉండే తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరం దేశానికి రెండవ రాజధానికి అద్బుతంగా ఉంటుందనేది పరిశీలకులు అంచనాగా తెలుస్తోంది. దేశంలో ఏళ్ల తరబడి బిగుసుకున్న చిక్కుముడి లాంటి సమస్యలను దేశ ప్రధాని నరేంద్ర మోదీ చాకచక్యంగా పరిష్కరిస్తున్పారు. సర్జికల్ స్ట్రైక్, పుల్వామా దాడులు, జమ్మూ కశ్మీర్, పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, అయోధ్య, శబరిమల దేవాలయం వంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వం చూపించిన చొరవ అద్బుతమనే చర్చ సాగింది. దీంతో నరేంద్ర మోదీ ఓ సాహసోపేత ప్రధాన మంత్రిగా దేశ ప్రజల్లో ముద్ర వేసుకున్నారు. ఇదే అదనుగా హైదరాబాద్ను కూడా దేశానికి రెండో రాజధానిని చేసి తీరుతారనే చర్చ జరుగుతోంది.
అన్ని విధాల హైదరాబాదే సుక్షితం.. రెండో రాజదానిగా నగరానికే ఎక్కువ మార్కులు..
ఏ రాష్ట్రంలో లేని ప్రకృతి సమతుల్యత హైదరాబాద్ నగరానికి ఉంది కాబట్టి, భూకంపాలు కూడా పెద్దగా సంభవించని నేల కాబట్టి దేశానికి హైదరాబాద్ నగరాన్ని రెండవ రాజధానిగా ఎంపిక చేసారు. ఒక్క రాజకీయంగానే కాకుండా అన్ని రంగాలపైన కేంద్రం ఆజమాయిషీ కొనసాగేలా పకడ్బందీ ప్రణాళికలు రూపొందిస్తున్నారు అధికారులు. అంతే కాకుండా హైదరాబాద్ నగరంలో ఉగ్రవాదులు కూడా అంత తేలిగ్గా చొరబడలేరని, జలమార్గంలేని హైదరాబాద్ రాజధానిగా అన్ని రకాలుగా సురక్షితంగా ఉంటుందని కేంద్ర పెద్దలు అంచనా వేసుకుంటున్నట్టు తెలుస్తోంది.
యూటీ గా హైదరాబాద్.. కసరత్తు చేస్తున్న కేంద్రం..
అన్ని విధాల ప్రగతి పథంలో దూసుకెళ్తున్న హైదరాబాద్ నగరం మరింత అభివృద్దికి ఆస్కారం ఉన్నందున రెండో రాజధానిని చేసేందుకు కేంద్ర పెద్దలు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. పర్యావరణం, రోడ్లు, ప్రభుత్వ భవంతులు, జన సాంద్రత, పరిశ్రమలు, జీవనోపాది, అక్షరాస్యత, తలసరి ఆదాయం, నగర విస్తీర్ణం, భాషా సంస్కృతులు, పర్యావరణం తదితర అంశాలపై దృష్టి పెట్తిన కేంద్ర ప్రభుత్వం రెండో రాజధానిగా హైదరాబాద్కు అన్ని అర్హతలు ఉన్నాయని నిర్ధారిస్తోంది. ఐతే నగరంతో పాటు చుట్టు పక్కల ప్రాతాలను కూడా కలుపుకుని యూనియన్ టెర్రటరీగా ప్రకటించి కేంద్రం ఆజమాయిషీలో హైదరాబాద్ నగరాన్ని మార్చేయాలనేది కేంద్ర వ్యూహంగా తెలుస్తోంది. అప్పుడు తెలంగాణ రాష్ట్రానికి రాజధాని ఖచ్చితంగా మారిపోతుంది. ఇదే అంశంపై రాబోవు రోజుల్లో రాజకీయ సమీకరణాల్లో భారీ మార్పులు తప్పవనే చర్చ కూడా జరుగుతోంది.