బాలు గారు పాటను విడవరు.!ప్రాణాలను విడవరు.!ఆయన సంకల్పం అంత దృఢమైందటున్న శిశ్యులు.!
హైదరాబాద్ : ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం పట్ల యావత్ సినిమా ప్రపంచం నివురుగప్పిన నిప్పులా మారపోయింది. బాలు ఆరోగ్యం గురించి ఓ పక్క ఆశావహ దృక్పదం, మరోపక్క ఆందోళన వాతావారణంతో సినీ పరిశ్రమ మొత్తం యుద్దాన్ని మరిపించే నిశ్శబ్దాన్ని తలపిస్తోంది. బాలు వంటి నేపథ్య గాయకుడు భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడా ఉండి ఉండరనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాలు ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని ఆయనతో పాలు సంగీత ప్రపంచంలో ప్రయాణం చేసిన చాలా మంది గాయకులు, గేయ రచయితలు, సంగీత ప్రేమికులు కోరుకుంటున్నారు.
బాలు గారు తప్పక కోలుకుంటారు..
గాయకుడు బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ ఉత్కంఠను రేపుతోంది. బాలు ఆరోగ్యం కుదురుకుంటుందని వస్తున్న వార్తలు ఊరట కలిగిస్తున్నప్పటికి వెను వెంటనే మరో వార్త ఆందోళనరకంగా వెలువడుతోంది. మొత్తానికి బాలు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆయన కోలుకుంటున్నారని ప్రముఖులు స్పష్టం చేస్తుంటండంతో సంగీతం ప్రపంచం ఊపిరి పీల్చుకుంటోంది. బాలు త్వరగా కోలుకుని చిరు మందహాసంతో అందరిని పలకరించాలని సహచర నేపథ్య గాయకులు, సాహితీ వేత్తలు అభిప్రాయ పడుతున్నారు. ప్రముఖ గేయ రచయిత బాలాజీ, బాలు తో చేసిన ప్రయాణం, పరిచయానికి సంబంధించిన జ్ఞాపకాలను వన్ ఇండియాతో పంచుకున్నారు.
పాడుతా తీయగా వేదిక పంచుకున్నాను..
ఎస్పీ బాలసుబ్రమణ్యంతో పాడుతా తీయగా వేదికను పంచుకోవడం, ఆ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా తనను ఆహ్వానించడం మరిచిపోలేని అపురూపమైన సందర్భమని గేయ రచయిత బాలాజీ చెప్పుకొచ్చారు. బాలు గారు మానసికంగా, శారీరకంగా చాలా దృఢంగా ఉంటారని, ఇలాంటి వైరస్ లు ఆయనను ఏమీ చేయలేవనే ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. బాలు గారు పాడిన 40వేల పాటల ప్రస్దానాన్ని మరెవ్వరూ కొనసాగించలేరనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. బాలు లాంటి గాయకుడు మళ్లీ జన్మించే అవకాశాలు కూడా తక్కువే అన్నారు బాలాజీ.
బాలు పాటల ప్రస్దానం ఆగిపోదు..
తెలుగు కధానాయకుల గొంతులనే కాకుండా పలు భాషల్లోని కధానాయకులకు తగ్గట్టు గొంతు మార్చి పాడటం ఒక్క బాలుగారికే దక్కిందని, ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, చిరంజీవి లాంటి వైవిద్యమున్న హీరోలకు వారి గొంతులకు అనుగుణంగా పాటులు పాడటం ఒక్క బాలుకే సాధ్యమని వివరించారు. భారత సిని పరిశ్రమలో ఎంతో మంది కధానాయకులకు వారికి తగ్గట్టు పాటలు పాడటం, వారి గొంతులోనుండే రాగం వచ్చినట్టు పాడటం బాలుగారిలో ఉన్న ఉత్కృష్టమైన ప్రతిభకు తార్కాణమని బాలాజీ వివరించారు. ప్రధానంగా తెలుగులో నాలుగు జనరేషన్లకు పాడిన ఘనత ఒక్క బాలుగారికే దక్కుతుందని స్పష్టం చేసారు.
అఘాయిత్యాలు చేసుకోవద్దు..
ప్రపంచ వ్యాప్తంగా కోట్ట సంఖ్యలో ఉన్న బాలు గారి అభిమానులు ఆయన ఆరోగ్యం పట్ల కలత చెందొద్దని, బాలు సంపూర్ణ ఆరోగ్యంతో అందరిని పలకరిస్తారని, సంగీత ప్రపంచంలో ఆయన ప్రస్థానం ఇంకా కొనసాగుతుందని వివరించారు. బాలు ఆరోగ్యం పట్ల ఆందోళన చెంది ఆత్మహత్యలు చేసుకోవద్దని బాలాజీ పిలుపునిచ్చారు. 20సంవత్సరాలుగా పాడుతా తీయగా కార్యక్రమం రాష్ట్రంలో ఎక్కడ జరిగినా అక్కడికు వెళ్లి బాలు గాత్రాన్ని ఆస్వాదించే వీరాభిమాని, బాలు ఆరోగ్యం పట్ల కలత చెంది ఆత్మహత్య చేసుకోవడం పట్ల విచారం వ్యక్తం చేసారు. బాలు త్వరలోనే అందరి సమక్షంలో మళ్లీ సంగీత సేవ చేసి అలరిస్తారని, ఎవ్వరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని బాలాజీ స్పష్టం చేసారు.