టీ సర్కార్ విధానాలపై యుద్దం మొదలైంది..! పార్టీ మారే ప్రసక్తే లేదన్న టీటీడిపి ఎమ్మెల్యే..!!
హైదరాబాద్ : తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మళ్లీ ప్రజా పోరాటాలకు శ్రీకారం చుట్టింది. తెలంగాణలో గులాబీ ప్రభుత్వం ఇచ్చిన ఏఒక్క హామీ కూడా అమలు చేయడం లేదని తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. తెలంగాణలో ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామని తెలంగాణ టీడిపి స్పష్టం చేస్తోంది. తెలంగాణలో 2014ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన నిరుపైదలందరికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తామన్న హామీ అమలు కావడం లేదని, కొన్ని నియోజక వర్గాల్లో అసలు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణమే చేపట్టలేదదని టీడిపి ఆరోపిస్తోంది.
ఇందులో భాగంగా ప్రభుత్వ తీరుకు నిరసనగా ఇందిరా పార్క్ వద్ద టీడిపి తెలంగాణ శాఖ మహా ధర్మా కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ప్రభుత్వం ఇప్పటికైనా ఇళ్ల నిర్మాణానికి పూనుకోకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని టీడిపి ముఖ్య నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ సందర్బంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఏకైక ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు వన్ ఇండియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. తాను పార్టీ మారుతానని ప్రచారం తారా స్థాయిలో జరుగుతోందని, కాని తన చివరి శ్వాస వరకూ తెలుగుదేశం పార్టీలో కొసాగుతానని నాగేశ్వరరావు స్పష్టం చేసారు.
అదికార గులాబీ పార్టీ మాటలతో తెలంగాణ ప్రజానికాన్ని తప్పుదోవ పట్టిస్తోందని, ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతోందని టీడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రభుత్వ శాఖల్లో అవినీతి అనకొండలా పెరిగిపోయిందని, అయినా పట్టించుకునే నాధుడు కరువయ్యాడని టీడిపి ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు మండిపడ్డారు. మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ పథకాల్లో అవినీతి తారా స్థాయిలో జరిగిందని ఘాటుగా విమర్శించారు.
నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని ఓట్లు వేయించుకున్న ప్రభుత్వం ఆ తర్వాత మాట మార్చిందని ఆరోపించారు. ప్రభుత్వ వ్యవహారం ఇలాగే ఉంటే ఉద్యామాలను మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. తాను తెలుగుదేశం పార్టీ తరుపున గెలిచానని, పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేసారు. ఖమ్మం జిల్లాలో గులాబీ పార్టీ నేత తుమ్మల నాగేశ్వర రావుతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్న మాట వాస్తవమేనని, ఆయన తరుచుగా సమావేశం అవుతుంటానని, అంతమాత్రాన పార్టీ మారతానని అనుకోవడం పొరపాటని వివరణ ఇచ్చారు నాగేశ్వర రావు.