వీడు మామూలు దొంగ కాదు.. బండ్ల చోరీ వయా OLX
హైదరాబాద్ : కష్టపడాల్సిన వయసులో కన్నింగుకు పాల్పడుతున్నారు కొందరు యువకులు. అందివచ్చిన టెక్నాలజీ అండగా మరింత రెచ్చిపోతున్నారు. చోరాగ్రేసరులకు సైతం పాఠాలు నేర్పేంతగా కొత్త పంథా ఎంచుకుంటున్నారు. తాజాగా టెక్నాలజీ పుణ్యమా అని రెచ్చిపోతున్న ఓ దొంగ ఆట కట్టించారు పోలీసులు. ఓఎల్ఎక్స్ టార్గెట్ గా వాహనదారుల దృష్టి మరల్చి బండ్లు ఎత్తుకెళుతున్న నేరస్థుడి గుట్టురట్టు చేశారు.
అగ్లీ ఫెలో..! వీసా కోసం పెళ్లిళ్ల దందా..! అమెరికాలో చిటుక్కున 80పెళ్లిళ్లు చేసిన ఎదవ..!!
మించిపోయాడు..!
ఈజీమనీ కోసం వెంపర్లాడుతున్న 21 ఏళ్ల యువకుడు దొంగలా మారాడు. టెక్నాలజీ సాయంతో వీజీగా దొంగతనాలు చేసేశాడు. తప్పు చేసినోడు ఏనాటికైనా దొరకాల్సిందే కదా. సరిగ్గా ఆ యువకుడి విషయంలోనూ అదే జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట మండలం కొత్తపల్లికి చెందిన జి.నగేశ్ అలియాస్ సురేందర్ ఈజీగా డబ్బులు సంపాదించాలని అనుకున్నాడు. ఆ క్రమంలో ఓఎల్ఎక్స్ పై దృష్టి సారించాడు.
ఓఎల్ఎక్స్ టార్గెట్..!
ఓఎల్ఎక్స్ లో అమ్మకానికి పెట్టిన వస్తువులైతే సులువుగా దొంగతనం చేయొచ్చని భావించాడు నగేశ్. ఆ మేరకు పథకరచన చేశాడు. సెకండ్ హ్యాండ్ సేల్స్ కింద ఓఎల్ఎక్స్ లో అమ్మకానికి పెట్టిన వాహనదారులను ముగ్గులోకి దించేవాడు. తనకు ఆ బండి నచ్చిందని వారిని కాంటాక్ట్ అవుతాడు. తీరా వారి దగ్గరకెళ్లాక ట్రయల్ పేరు చెప్పి ఉడాయిస్తాడు.
మొదటగా ఇలాంటి చోరీలకు పాల్పడాలని ఆలోచన వచ్చినప్పుడు రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ వాహనదారుడి బైక్ మాయం చేశాడు. ఆ ప్లాన్ విజయవంతం కావడంతో దొంగతనాలే బెటర్ అనుకున్నాడు. ఇక అక్కడినుంచి అదే వరుస. ఓఎల్ఎక్స్ లో బండ్లు చూడటం, చోరీలకు పాల్పడటం పనిగా పెట్టుకున్నాడు.
చిక్కాడిలా..!
షాద్ నగర్, రాయదుర్గం, గచ్చిబౌలి ప్రాంతాలే టార్గెట్ గా చోరీలకు పాల్పడ్డాడు. ఇటీవల షాద్ నగర్ నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు ఓ క్యాబ్ బుక్ చేసుకున్నాడు. మధ్యలో కారు ఆపి.. డ్రైవర్ ను సిగరెట్ తీసుకురమ్మని పురమాయించాడు. అతడు అలా వెళ్లగానే ఇలా కారుతో ఉడాయించాడు. దాంతో కారు యజమాని ముస్తఫా షాద్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఆ క్రమంలో నజర్ పెట్టిన పోలీసులకు వాహనాల తనిఖీల్లో ఈ దొంగ దొరికాడు. దొంగిలించిన క్యాబ్ కారుతో పట్టుబడ్డాడు. అతనిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు పోలీసులు. ఆరున్నర లక్షల రూపాయల విలువైన ఓ కారు, రెండు బైకులు, ఓ ట్యాబ్ ను స్వాధీనం చేసుకున్నారు.