KCR కేంద్రంలో చక్రం తిప్పలేరా.. హరీష్ రావుకు మంత్రి పదవి..! KTR కు ఆ పోస్ట్ లేనట్లేనా?
హైదరాబాద్ : టీఆర్ఎస్ రాజకీయ ఎత్తుగడలకు బ్రేక్ పడిందా? కేంద్రంలో చక్రం తిప్పుతానన్న సీఎం కేసీఆర్.. ఆ ప్రయత్నాన్ని తాత్కాలికంగా విరమించుకున్నారా? ఆయన తనయుడు కేటీఆర్ను ఇక్కడ ముఖ్యమంత్రి పీఠమెక్కించి.. ఫెడరల్ ఫ్రంట్తో దేశంలో కీ రోల్ పోషిస్తానన్న కేసీఆర్ కలలు ఏమైనట్లు. ఇలాంటి సవాలక్ష ప్రశ్నలకు తాజా పరిణామాలు సమాధానంగా కనిపిస్తున్నాయి.
థర్డ్ ఫ్రంట్తో ఢిల్లీపై కన్నేసిన కేసీఆర్.. ఆ మేరకు గట్టిగానే ప్రయత్నాలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో 16 స్థానాలు గెలిచి కేంద్రంలో కీ రోల్ పోషించేలా ప్లాన్ చేసుకున్నారు. కానీ ఫలితాల్లో తేడా కొట్టి కారు జోరు డీలా పడింది. అదలావుంటే బీజేపీకి బంపర్ మెజార్టీ రావడంతో థర్డ్ ఫ్రంట్ కలలు ఆవిరయ్యాయి. అంతేకాదు కేసీఆర్ కలిసిన ఇతర పార్టీ నేతలు ఫెడరల్ ఫ్రంట్పై ఎటూ తేల్చకపోవడం కూడా ఆయనను పునారాలోచనలో పడేసినట్లు తెలుస్తోంది.
కిషన్ రెడ్డి లక్ : హెంగార్డుల కోసం పోరాడారు.. హోం మంత్రి అయ్యారు
ఢిల్లీలో చక్రం తిప్పేది లేక.. సీన్ రివర్స్
తెలంగాణ ఉద్యమ ప్రస్థానంతో మొదలు టీఆర్ఎస్ రాజకీయ శక్తిగా అవతరించింది. 2014లో తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అదే జోరుతో 2018, డిసెంబర్ నెలలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో బంపర్ మెజార్టీ సాధించింది. 88 స్థానాలు కైవసం చేసుకుని రెండోసారి అధికారంలోకి వచ్చింది. అయితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఎదురుదెబ్బ తగిలింది. కారు జోరుకు బ్రేకులు వేస్తూ బీజేపీ నాలుగు స్థానాల్లో పాగా వేయగా.. కాంగ్రెస్ మరో మూడు స్థానాల్లో విజయం సాధించింది.
లోక్సభ ఎన్నికలపై సీఎం కేసీఆర్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. 16 స్థానాల్లో గెలిచి ఢిల్లీలో చక్రం తిప్పుతానని కలలుగన్నారు. చివరకు దేశవ్యాప్తంగా మోడీ ప్రభంజనం వీయడంతో కారు జోరుకు బ్రేకులు పడ్డాయి. కేవలం 9 స్థానాలకే టీఆర్ఎస్ పరిమితమైంది. దేశవ్యాప్తంగా బీజేపీకి 150 స్థానాలు మాత్రమే వస్తాయని.. ఏ పార్టీకి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసేంత మెజార్టీ రాకపోవచ్చనేది టీఆర్ఎస్ నేతల అంతరంగం. అందుకే కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో టీఆర్ఎస్కు కీ రోల్ దక్కుతుందని భావించారు. కానీ సీన్ రివర్సయింది.
తాను ఢిల్లీకి.. సీఎం కుర్చీ తనయుడికి.. లెక్కలు కుదరలేదుగా..!
303 స్థానాలతో బీజేపీకి బంపర్ మెజార్టీ దక్కడం.. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై కేసీఆర్ కలిసిన పార్టీల అగ్రనేతలు సరిగా స్పందించకపోవడం తదితర కారణాలతో ఆయన తాత్కాలికంగా వెనుకడుగు వేస్తున్నట్లు అర్థమవుతోంది. అదలావుంటే ఢిల్లీలో చక్రం తిప్పేలా ప్లాన్ వేసిన కేసీఆర్ వ్యూహం బెడిసికొట్టిందనే వాదనలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
థర్డ్ ఫ్రంట్ పేరుతో తాను ఢిల్లీ బాట పడితే.. రాష్ట్రంలో ముఖ్యమంత్రి పీఠం తనయుడు కేటీఆర్కు అప్పగిస్తారనే ప్రచారం అప్పట్లో జోరందుకుంది. ఆ మేరకు ఆయనను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించారనే టాక్ నడుస్తోంది. అందుకే లోక్సభ ఎన్నికల వేళ ఉమ్మడి పది జిల్లాల్లో నిర్వహించిన టీఆర్ఎస్ సన్నాహాక సదస్సుల బాధ్యతను కేటీఆర్ మోయడం చర్చానీయాంశమైంది.
ఢిల్లీలో చక్రం తిప్పేది లేక.. రాష్ట్రానికే పరిమితం ఇక..!
బీజేపీకి బంపర్ మెజార్టీ రావడంతో.. థర్డ్ ఫ్రంట్ పై కేసీఆర్ కాస్తా వెనక్కి తగ్గారనే ప్రచారం జరుగుతోంది. తాత్కాలికంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై దృష్టి తగ్గించనున్నారనే టాక్ నడుస్తోంది. ఇక ఢిల్లీలో చక్రం తిప్పే ఛాన్స్ లేకపోవడంతో కేసీఆర్ తన వ్యూహాలను మార్చుకున్నట్లు తెలుస్తోంది. అందుకే ప్రస్తుతానికి ఆయన రాష్ట్రానికే పరిమితం కావాలని మనసు మార్చుకున్నట్లు సమాచారం.
కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో చక్రం తిప్పేది లేక.. ఇటు లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్కు గట్టి ఎదురుదెబ్బ తగలడంతో కేసీఆర్ పునారాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో పాలనపై దృష్టి పెడుతూ మంత్రివర్గ విస్తరణకు లైన్ క్లియర్ చేయనున్నట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాలు జులై చివరలో లేదంటే ఆగస్టులో నిర్వహించాలని భావిస్తున్నారట. అంతకుముందే జులై మూడో వారంలోగా మంత్రివర్గం విస్తరించేలా ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి.
వామ్మో స్కూళ్లు.. తల్లిదండ్రుల్లో జూన్ భయం..!
కేబినెట్లోకి కొడుకు, అల్లుడు.. హరీష్ రావును గుర్తించారా?
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్కు లోక్సభ ఎన్నికల బాధ్యతలు అప్పగించారు. హరీష్ రావుకు మాత్రం కేవలం మెదక్ పార్లమెంటరీ స్థానం బాధ్యత మాత్రమే అప్పగించారు. అయితే ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ లోక్సభ స్థానాల్లో టీఆర్ఎస్ ఓటమి పాలయింది. కారుకు కలిసొచ్చిన కరీంనగర్లో ఓడిపోవడం పార్టీశ్రేణులకు మింగుడుపడటం లేదు. మెదక్ స్థానంలో మాత్రం 3 లక్షలకు పైగా బంపర్ మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు.
లోక్సభ ఎన్నికల ఫలితాల దృష్ట్యా.. హరీష్ రావు ఛరిష్మాను, ఆయన అంకితాభావాన్ని కేసీఆర్ గుర్తించినట్లు టాక్ నడుస్తోంది. ఆ క్రమంలో అల్లుడిని, కొడుకును మంత్రివర్గంలోకి తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కేసీఆర్ ఎటూ ఢిల్లీ వెళ్లలేక.. ఇటు కేటీఆర్కు ముఖ్యమంత్రి కుర్చీ అప్పగించలేక ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. మొత్తానికి ఈ ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చి.. మునుపటిలాగే తాను సీఎంగా పాలన కొనసాగించాలని డిసైడ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది.