డిగ్రీ,పీజీ పరీక్షలు... అంతా గందరగోళం... ప్రభుత్వానికే క్లారిటీ లేదన్న హైకోర్టు..
డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్ పరీక్షల నిర్వహణ తీరుపై తెలంగాణ హైకోర్టు ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. పరీక్షల నిర్వహణపై ప్రభుత్వానికే స్పష్టత లేదని పేర్కొంది.
పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించాలని ఎన్ఎస్యూఐ,ఇతర పిటిషనర్లు కోరగా...గ్రామీణ ప్రాంతాల్లో కంప్యూటర్లు, ఇంటర్నెట్ సమస్య తలెత్తుతుందని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. కాబట్టి ఆన్లైన్ పరీక్షలు సాధ్యపడవని చెప్పింది. ఒకవేళ పరీక్షలు రాయలేని విద్యార్థులు సప్లిమెంటరీ రాయవచ్చునని... సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైనప్పటికీ రెగ్యులర్ కిందనే పరిగణిస్తామని తెలిపింది.
కేవలం అటానమస్ కాలేజీలు మాత్రమే ఆన్లైన్ పరీక్షల అనుమతులు ఇచ్చామని హైకోర్టుకు తెలిపింది. మరోవైపు,క్యాంపస్ ఇంజనీరింగ్ కాలేజీలో మాత్రమే ఆన్లైన్లో పరీక్షలు నిర్వహిస్తామని ఓయూ అధికారులు,మిడ్టర్మ పరీక్షలు ఆన్లైన్లో,సెమిస్టర్ పరీక్షలు ఆఫ్లైన్లో నిర్వహిస్తామని జేఎన్టీయూహెచ్ అధికారులు కోర్టుకు వివరించారు. దీంతో ప్రభుత్వ విధానం గందరగోళంగా ఉందని... ఆఫ్ లైన్ లేదా ఆన్లైన్లలో ఏదో ఒక విధానంలో పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు సూచించింది. ఈ మేరకు ప్రభుత్వం స్పష్టతనివ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను మంగళవారం(సెప్టెంబర్ 15)కి వాయిదా వేసింది.
కాగా,కరోనా వైరస్ నేపథ్యంలో ఈ ఏడాది డిగ్రీ,పీజీ సంవత్సరం విద్యార్థులకు వారు చదువుతున్న కాలేజీల్లోనే పరీక్షలు రాసే వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ చివరి వారంలో లేదా అక్టోబర్లో పరీక్షలు జరిగే సూచనలున్నాయి. నీట్,జేఈఈ లాంటి ప్రతిష్టాత్మక పరీక్షలను కేంద్రం నిర్వహిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డిగ్రీ,పీజీ పరీక్షలకు సిద్దమవుతున్నాయి.