అయ్యప్ప భక్తుల విషయంలో కొత్త నిర్ణయం ఏమీ లేదు ... డీజీపీ ఆఫీసు ఉత్తర్వుల మేరకే : సీపీ మహేష్ భగవత్
అయ్యప్ప మాల వేసుకునే పోలీస్ సిబ్బందికి విధులు నిర్వర్తించడానికి ప్రత్యేక అనుమతులు ఇవ్వడం కుదరదని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. అయ్యప్ప మాల వేసుకోవాలనుకునే పోలీసు సిబ్బంది రెండు నెలల పాటు సెలవుపై వెళ్లిపోవాలని సూచించిన హైదరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇక ఈ నేపధ్యంలో తాజాగా ఆయన మరోమారు అయ్యప్ప దీక్ష చేసే పోలీసుల విషయంలో నెలకొన్న వివాదంపై స్పందించారు.
అయ్యప్ప మాల వేసే పోలీసులకు ప్రత్యేక అనుమతులు కుదరవు.. రాచకొండ సీపీ మహేష్ భగవత్
అయ్యప్ప దీక్ష చేపట్టే పోలీసులు శెలవు మీద వెళ్ళాలని ప్రత్యేక అనుమతులు కుదరవని పోలీస్ శాఖలో అంతర్గతంగా సర్క్యులర్ జారీ అయింది. అయితే, దీనిపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సహా పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నెటిజన్లు సైతం పెదవి విరిచారు. ముస్లింలకు రంజాన్ సమయంలో ఎలా సడలింపు ఇస్తారో, హిందువులకు కూడా అలాగే ఇవ్వాలని ఎమ్మెల్యే రాజా సింగ్ డిమాండ్ చేశారు. రంజాన్ సమయంలో టోపీలు, గడ్డాలు తీసేయాలని ముస్లింలకు మీరు మెమోలు జారీ చేయగలరా? అని పోలీస్ కమీషనర్ ను బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ప్రశ్నించారు. అయ్యప్పమాల వేసుకున్న వాళ్లకు స్వేచ్ఛ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ఈ విషయంపై స్పందించిన మహేశ్ భగవత్ రాచకొండ పోలీసులపై జరుగుతున్న తప్పుడు ప్రచారం నమ్మవద్దని తెలిపారు. పోలీసులు విధులు నిర్వహించే క్రమంలో సర్వీస్ నిబంధనల మేరకు వ్యవహరించాలని డీజీపీ ఆఫీస్ నుంచి ఉత్తర్వులు వచ్చాయని, ఆ ఉత్తర్వులనే తాము అమలు చేస్తున్నామని తెలిపారు మహేష్ భగవత్ . అయ్యప్ప భక్తుల విషయంలో కొత్తగా ఏ నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఇక తమకు అన్ని మతాలూ సమానమే అని ఆయన పేర్కొన్నారు.