కేసీఆర్ క్యాబినెట్ లో కొత్త ముఖాలు ఇవేనా..? వారే ఎందుకు..??
Recommended Video
హైదరాబాద్: రెండు నెలల తరువాత రాష్ట్రంలో కొత్త మంత్రివర్గం కొలువు తీరుతోంది. ఈ నెల 19వ తేదీన ఉదయం 11.30 కి రాజ భవన్ లో మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఖరారైంది. దీంతో మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు దక్కుతుందనే దానిపై అప్పుడే చర్చలు, ఊహాగానాలు జోరందుకున్నాయి. ఉమ్మడి జిల్లాల వారీగా ఆశావహులను పరిశీలిస్తే కులాలు, ప్రాంతాల సమీకరణలు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈసారి పూర్తి స్థాయి మంత్రి వర్గం ఏర్పాటు చేస్తారా లేదా పాక్షికంగా విస్తరణ చేస్తారా అనేది అంచనా వేయలేని పరిస్థితి ఉంది. మరో మూడు నెలలో పార్లమెంటు ఎన్నికలు ఉండడంతో పాక్షికంగా 10 మందితో మంత్రివర్గం కొలువుదీరే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పది మందిలో ఐదుగురు వరకు కొత్త ముఖాలే ఉంటాయంటున్నారు.
మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు.. 19 న ప్రమాణ స్వీకారాలు..
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మంత్రివర్గ ముహూర్తం ఎట్టకేలకు ఈనెల 19న ఖరారైంది. ఇక మంత్రి యోగం ఎవరిని వరిస్తుంది, కెసిఆర్ మంత్రి వర్గంలో చోటు దక్కేదెవరికి అనేది తాజా మాజీ మంత్రులు, సీనియర్ ఎంఎల్ఎలలో తీవ్ర ఉత్కంఠత నెలకొన్నది. కాగా సామాజిక న్యాయాన్ని పాటించడంతో పాటు పాత పది ఉమ్మడి జిల్లాలకు ఒకరు చొప్పున సుమారు పది మంది వరకు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
పది మందికి మంత్రులుగా అవకాశం.. కొత్త వారిని ఊరిస్తున్న మంత్రి పదవి..
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి మాజీ మంత్రి సీ. లక్ష్మారెడ్డితో పాటు రెండో సారి విజయం సాధించిన వి.శ్రీనివాస్ గౌడ్ పేర్లు ప్రముఖంగా విన్పిస్తున్నాయి. మెదక్ జిల్లా నుంచి ప్రస్తుతం సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తుండగా మరో ఇద్దరిని తీసుకోనున్నారు. మొదట హరీశ్ రావు పేరు లేదని చెప్పినప్పటికీ ఖచ్చితంగా ఆయనను తీసుకుంటున్నారు. హరీశ్ రావును మంత్రివర్గంలోకి తీసుకోవాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం కేసీఆర్ ను కోరారనే వార్తలు వస్తున్నాయి.
మహిళలకు అవకాశం ఇవ్వనున్న సీయం.. అద్రుష్టం ఎవరిదో..
కొందరు తాజా మాజీలతో పాటు కొత్తగా కొప్పుల ఈశ్వర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎర్రబెల్లి యాదకర్రావు, వినయ్ భాస్కర్, రెడ్యానాయక్, పువ్వాడ అజాయ్కుమార్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. గత మంత్రి వర్గంలో మహిళలకు అవకాశం లేకపోవడంతో ఈసారి వారికి ప్రతినిధ్యం కల్పించాలని సిఎం భావిస్తున్నారు.
జిల్లాల వారిగా ప్రాతినిధ్యం.. పాత కొత్త కలయికతో మంత్రి వర్గం..
మహిళా కోటాలో మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి, ఎంఎల్ఎ రేఖనాయక్ పేర్లు పరిశీలనలో ఉన్నా యి. కాగా మహబూబ్నగర్ జిల్లా నుంచి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, నిజామాబాద్ నుంచి వేముల ప్రశాంత్ రెడ్డి, కరీంనగర్ జిల్లా నుంచి ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, వరంగల్ జిల్లా నుంచి ఎర్రబెల్లి దయాకర్రావు, వినయ్ భాస్కర్, నల్లగొండ నుంచి జి.జగదీశ్రెడ్డి, ఆదిలాబాద్ నుంచి ఇంద్రకరణ్ రెడ్డి లేదా జోగురామన్న, హైదరాబాద్ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రంగారెడ్డి జిల్లాలో తాజా మాజీమంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఓడిపోయిన నేపథ్యంలో ఇక్కడి నుంచి అవకాశం కల్పించాలా? లేదా మరోసారి జరిగే మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పించాలా అనే అంశంపై చర్చలు జరిపారు.