బ్లాక్ మనీ వైట్ చేయమని చెప్పారు.. రెండో రోజు కస్టడీలో శిల్ప చౌదరీ సంచలనం
పోలీస్ కస్టడీలో శిల్పా చౌదరి సంచలన విషయాలను తెలియజేశారు. రాధికా రెడ్డి అనే మహిళ తనను మోసం చేసినట్లు శిల్పా చౌదరి పేర్కోంది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో పోలీసులు గండిపేటలోని ఆమె నివాసం సిగ్నేచర్ విల్లాకు తీసుకువెళ్లి ఇంట్లో నుంచి పలువిలువైన పత్రాలను, నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ పత్రాల్లో కొంత మంది ప్రముఖుల పేర్లు ఉండటంతో వారికీ, శిల్పాకు మధ్య జరిగిన లావాదేవీలపై కూపీ లాగే ప్రయత్నం చేస్తున్నారు. శిల్ప కేసు విషయంలో పోలీసులు వారిని కూడా విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. శిల్పా చౌదరి రెండో రోజు పోలీసు కస్టడీ ముగిసింది.
ప్రముఖుల వద్ద నుంచి తీసుకున్న డబ్బులు ఎక్కడ దాచిపెట్టింది, ఎక్కడ పెట్టుబడి పెట్టింది అనే విషయంలో శిల్ప నోరు విప్పక పోయే సరికి ఆమె ఇంట్లో దొరికిన పత్రాల ఆధారంగా పలువురిని విచారించే అవకాశం ఉంది. ముందస్తుగా వారికి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నట్లు తెలిసింది. ఈ రోజు విచారణలో శిల్పా చౌదరి, తనను రాధికారెడ్డి అనే మహిళ మోసం చేసినట్లు చెప్పుకొచ్చింది. తామిద్దరి మధ్య గత కొన్నేళ్లుగా ఆర్ధిక లావాదేవీలు జరుగుతున్నాయని తెలిపింది.
6 శాతం వడ్డీ ఇస్తానని చెప్పిన రాధికకు రూ.30 కోట్లు ఇచ్చానని, ఆమె తిరిగి తనకు డబ్బులు చెల్లించలేదని చెప్పింది. రాధిక రియల్ఎస్టేట్, ఈవెంట్ మేనేజ్మెంట్ లు నిర్వహిస్తున్నట్లు శిల్పాతెలిపింది. రాధిక పాత్రపై కూడా పోలీసులు విచారణ జరపనున్నారు. రాధికారెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చి ఆమెను విచారించనున్నారు. కొంతమంది దగ్గర డబ్బులు తీసుకున్న మాట వాస్తవమేనని, వారంతా బ్లాక్ మనీని వైట్ చేయమని ఇచ్చారని ఆమె చెప్పుకొచ్చింది. రాధికారెడ్డి ఇవ్వాల్సిన డబ్బుల కాకుండా...తాను ఇన్వెస్ట్ చేసిన ప్రాజెక్టుల నుంచి డబ్బులు రాలేదు కాబట్టి నేను ఇవ్వలేక పోయానని... నేను ఎవరినీ మోసం చేయలేదని శిల్పా వివరించింది.
అనంతరం ఆమెను ఉప్పర్పల్లిలోని రాజేంద్రనగర్ కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరు పరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు ఆమెను చంచల్గూడ జైలుకు తరలించారు. కాగా...మరో రెండు కేసులకు సంబంధించి విచారణ నిమిత్తం శిల్పాను పోలీసులు మళ్లీ కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది.