చోరీల్లో నెంబర్ వన్.. దేనికి భయపడడు.. ఆ కుక్కను చూస్తే మాత్రం షేక్..!
హైదరాబాద్ : దొంగతనాల్లో ఆరి తేరాడు. చోరీలు చేయడం అతడికి వెన్నతో పెట్టిన విద్య. అవలీలగా దొంగతనాలు చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నాడు. చోరీల్లో ఘరానా చరిత్ర నమోదు చేసుకున్న సదరు దొంగ తీరు నగర వాసులకు సుపరిచితమే. మంత్రి శంకర్ అంటే దాదాపు జంట నగర వాసులకు అందరికీ తెలిసినోడే. 250కి పైగా కేసులు ఉండడం.. 32 సార్లు జైలుకు వెళ్లడం అతడి నేర ప్రవృత్తిని కళ్లకు కడుతుంది. అంతేకాదు మూడు సార్లు పీడీ యాక్ట్ కూడా ప్రయోగించారు పోలీసులు. అంతటి పెద్ద దొంగకు భారీ కుక్కలైనా భయం లేదంట కానీ ఆ కుక్కలను చూస్తే మాత్రం పారిపోతాడట. పోలీస్ విచారణలో మంత్రి శంకర్ ఈ విషయం వెల్లడించాడు.
చిన్మయానంద కేసు : కోర్టుకు హజరైన యూపీ లా విద్యార్థిని
ఘరానా దొంగ మంత్రి శంకర్ నేపథ్యం
సికింద్రాబాద్ చిలకలగూడ ప్రాంతానికి చెందిన 59 ఏళ్ల మంత్రి శంకర్ అలియాస్ శివ ప్రసాద్ అలియాస్ శివన్న నేర ప్రవృత్తి అంతా ఇంతా కాదు. 19 ఏళ్ల వయసులోనే నేరాల బాట పట్టాడు. అలా 1979వ సంవత్సరంలో మొదటిసారిగా తొలి నేరం చేశాడు. కుటుంబ సభ్యులతో గొడవ పడుతున్న ఓ వ్యక్తిని హత్య చేసి జైలుకు వెళ్లాడు. అలా అక్కడ ఏర్పడ్డ పరిచయాలతో పెద్ద దొంగగా మారాడు. జైలులోనే వంటగది తాళాలు పగులగొట్టడం నేర్చుకున్న మంత్రి శంకర్.. జైలు నుంచి బయటకొచ్చాక తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తూ రెచ్చిపోయేవాడు. తాను నివాసముండే చిలకలగూడ ప్రాంతంతో పాటు రామంతపూర్, నేతాజీ నగర్, బోయిన్పల్లి, బేగంపేట, మారేడ్పల్లి, కార్ఖానా, ఉస్మానియా వర్సిటీ పరిధిలోనే చోరీలు చేసేవాడు. ఈ ప్రాంతాల్లో అతడికి మంచి పట్టుండటంతో దొంగతనాలు ఎక్కువగా ఇక్కడే చేసేవాడు.
చోరీలకు ముందు రెక్కీ
దొంగతనాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకునేవాడు మంత్రి శంకర్. చోరీలకు ముందు ఆయా కాలనీల్లో రెక్కీ నిర్వహించేవాడు. ఆ క్రమంలో కాస్ట్లీ దుస్తులు వేసుకోవడంతో పాటు టై, బూట్లు ధరించేవాడు. అలా టార్గెట్ ఫిక్స్ చేసుకున్నాక.. అర్ధరాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజామున 3-4 గంటల వరకు చోరీలు చేసేవాడు. తాళం వేసి ఉన్న ఇళ్లను మాత్రమే దొంగతనాలకు ఎంచుకునేవాడు. ఇక చోరీ తతంగం పూర్తయిన తర్వాత ఆ ఇంటి మేడపైన కూర్చుంటాడు. ఉదయాన్నే వాకింగ్కు వెళ్లే వాళ్లు కనిపించగానే మెల్లిగా ఆ గుంపు వెనకాల నడుస్తూ వాకర్ లాగా నటిస్తూ అక్కడినుంచి ఎస్కేప్ అయ్యేవాడు. ఎలాంటి సరంజామా తన వెంబడి లేకుండా.. ఎప్పుడూ కేవలం నాలుగు స్క్రూ డ్రైవర్లు, చిన్న రాడ్డు పెట్టుకుని మాత్రమే చోరీలు చేస్తుంటాడు. ఎంత పెద్ద తాళమైనా.. కేవలం మూడంటే మూడు సెకన్లలో దంచి కొట్టడం.. లోపలికి ఎంట్రీ ఇవ్వడం మంత్రి శంకర్కు అచ్చొచ్చిన విద్య.
40 సంవత్సరాల నుంచి చోరీలు చేయడమే వృత్తి
చోరాగ్రేసరుడిగా ముద్ర పడ్డ మంత్రి శంకర్ తండ్రి మాజీ రైల్వే ఉద్యోగిగా తెలుస్తోంది. ఇతను ఒక్కడే సంతానం కావడంతో బలాదూర్గా తిరిగి ఇలా దారి తప్పాడని సమాచారం. దాదాపు 40 సంవత్సరాల నుంచి చోరీలనే వృత్తిగా మలచుకున్న మంత్రి శంకర్కు ముగ్గురు భార్యలు, ఆరుగురు పిల్లలు ఉన్నారు. అంతేకాదు మరో యువతితో సహజీవనం చేయడంతో పాటు వ్యభిచారిణులతో గడపడం ఇతడి ప్రధాన హాబీగా పోలీసులు చెబుతున్నారు. చోరీ సొమ్మును నగదుగా మార్చుకుని జల్సాలు చేయడం ఇతడికి అలవాటుగా మారింది.
255 కేసులు.. 32 సార్లు అరెస్ట్.. 3 సార్లు పీడీ యాక్ట్
మంత్రి శంకర్పై ఇప్పటివరకు 255 కేసులు నమోదు కాగా 32 సార్లు అరెస్టయ్యాడు. 2015, 2017, 2018 సంవత్సరాల్లో మూడుసార్లు పీడీ యాక్ట్ కూడా ప్రయోగించారు పోలీసులు. జైలు జీవితం కాకుండా బయట ఉన్న సమయాల్లో నెలకు దాదాపు 3 నుంచి 4 దొంగతనాలు చేయడం పనిగా పెట్టుకుంటాడు. మిగతా రోజులంతా ఎంజాయ్ మూడే. బ్రాండెడ్ దుస్తులు, వస్తువులు కొనడం మంత్రి శంకర్ హాబీగా చెబుతున్నారు పోలీసులు. అయితే పోలీసుల నుంచి తప్పించుకోవడానికి వరుసగా 3 రోజులు ఏ ప్రాంతంలో కూడా ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటాడు. ప్రతి 3 రోజులకోసారి మకాం మార్చుతూ ఉంటాడు.
పమేరనియన్ డాగ్స్ అంటే భయమట..!
ఇంత నేర చరిత్ర ఉన్న మంత్రి శంకర్కు పమేరనియన్ డాగ్స్ అంటే చచ్చేంత భయమట. భారీ కుక్కలకు కూడా భయపడని శంకర్.. ఆ కుక్కలకు మాత్రం చాలా భయపడతాడని పోలీసుల విచారణలో వెల్లడించాడు. ఆ కుక్కలున్న ఇళ్లను మాత్రం చోరీ చేయకుండా వదిలేస్తాడట. ఎందుకంటే అవి పెద్దగా అరుస్తాయనేది అతడు పోలీసులకు చెప్పిన సమాధానం. మిగతా కుక్కలను మచ్చిక చేసుకోవచ్చు గానీ పమేరియన్ డాగ్స్ను మాత్రం దగ్గరకు తీసుకోవడం గగనమే అన్నది మంత్రి శంకర్ వెర్షన్.