నాయిని అంత్యక్రియల్లో దొంగల చేతివాటం... ప్రజా ప్రతినిధుల పర్సులు గాయబ్...
తెలంగాణ మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియల్లో దొంగలు చేతివాటం ప్రదర్శించారు. అంత్యక్రియలకు తరలివచ్చిన ప్రజా ప్రతినిధులు,పలువురు ప్రముఖుల పర్సులను ఓ దొంగల ముఠా కొట్టేసింది. పర్సులు పోయిన విషయాన్ని కొంతమంది ప్రముఖులు వెంటనే పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో తక్షణం వారు అప్రమత్తమై ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రూ.3వేలు స్వాధీనం చేసుకున్నారు. మిగతా దొంగల ముఠా సభ్యుల గురించి ఆరా తీస్తున్నారు.
నాయిని పాడెమోసిన కేటీఆర్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా..కేసీఆర్ కంటతడి..
తెలంగాణ రాష్ట్ర తొలి హోంమంత్రి,కార్మిక నేత నాయిని నర్సింహారెడ్డి బుధవారం(అక్టోబర్ 21) అర్ధరాత్రి దాటాక కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత నెల 28వ తేదీన కరోనా బారినపడిన ఆయన బంజారాహిల్స్లోని సిటీన్యూరో సెంటర్ ఆస్పత్రిలో 16 రోజులపాటు చికిత్స పొందారు. వారం రోజుల క్రితం కరోనా నెగెటివ్ వచ్చినప్పటికీ.. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సోకడంతో ఆరోగ్యం క్షీణించింది. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను అపోలో ఆస్పత్రికి తరలించగా... అప్పటినుంచి వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. బుధవారం రాత్రి ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో ఆయన తుది శ్వాస విడిచారు.
జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో నాయిని అంత్యక్రియలను ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించింది. ఈ సందర్భంగా మంత్రులు కేటీఆర్,శ్రీనివాస్ గౌడ్ నాయిని పాడెను మోశారు. ఆ తర్వాత పలువురు ప్రజాప్రతినిధులు నాయిని పాడె మోసి నివాళులర్పించారు. నాయినికి కడసారి వీడ్కోలు పలికేందుకు జనం భారీ ఎత్తున మహాప్రస్థానానికి తరలివచ్చారు.
Recommended Video
కాగా,నాయిని 1969 తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు.1969లో జనతా పార్టీతో ఆయన రాజకీయ ప్రయాణం మొదలైంది. 1978, 1985లో జనతా పార్టీ తరఫున ముషీరాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004లో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది.. నాటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వంలో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 2014 జూన్ 2న ఏర్పడిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర మొదటి హోంశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత గవర్నర్ కోటాలో శాసనమండలికి ఎంపికయ్యారు. ఎమ్మెల్సీగా ఆయన పదవీ కాలం ఈ ఏడాది ఏప్రిల్తో ముగిసింది.