కేంద్ర వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఈ బడ్జెట్..! విరుచుకుపడ్డ టీటీడిపి..!!
హైదరాబాద్ : కేంద్ర బడ్జెట్ రాబోవు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తాయిలాలు ప్రకటించారు తప్ప నిరుపైదలకు చేలు చేద్దామని కాదని టీటీడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. కేంద్ర బీజేపి చేసిన అనేక వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఈ మద్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టారని ఆరోపించారు. బడ్జెట్ సారాంశం వినిపిస్తున్నప్పుడు నోట్ల రద్దు వల్ల ఏం ప్రయోజనం జరిగిందనేది ఆర్ధిక మంత్రి చెప్పలేదని, పైగా నోట్ల రద్దు తో దేశ ప్రజల మనసులను బీజేపి గాయ పరిచిందని ఆవేదన వ్యక్తం చేసారు. పెట్రోల్, డీజిల్ ధరల నియంత్రణ చేయ లేక పోయారని, 2 హెక్టార్ల లో వ్యవసాయం చేస్తున్న కుటుంబాల పై అధ్యయనం చేసారని, భూముల విషయం రాష్ట్రాలకు సంబందించిన అంశంమని దీన్ని కేంద్రం గుప్పట్లోకి తీసుకోవడం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని రావుల అన్నారు.
ఆర్థిక సహాయాన్ని నేరుగా రైతులకు ఎలా వేస్తారని ఆయన ప్రశ్నించారు. నదుల అనుసంధానం, పెరిగిన ఎరువుల ధరల పై ప్రస్తావన లేదని, కనీసం నదుల అనుసంధానాలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రోత్సహాకాలు కూడా కేంద్రం ప్రకటించే పరిస్థితిలో లేదని ఆవేదన వ్యక్తం చేసారు. దేశంలో ఆదాయ పన్ను కడుతుంది ఎంతమందో కేంద్రం వద్ద ఖచ్చితమైన లెక్కలు లేవని అన్నారు. రాష్ట్రాల హక్కులు హరించేలా కేంద్ర బడ్జెట్ రూపొందించడమే కాకుండా, తెలుగు రాష్ట్రాలకు విభజన హామీల పై ప్రస్తావనే లేదని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వానికి ఇది చివరి బడ్జెట్ అని, దిగిపోయే ముందు కూడా తెలుగు రాష్ట్రాల ను మోదీ ప్రభుత్వం కరుణించ లేదని రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.