వేల సంఖ్యలో ఓట్లు వృధా..! చదువుకున్నోళ్ల కంటే నిరక్షరాస్యులే బెటరా?
హైదరాబాద్ : ఓటు వేసే విషయంలో చదువుకున్నోళ్లు వెనుకబడుతున్నారా? ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం బాధ్యత అని తెలిసినోళ్లే పొరపాట్లు చేస్తున్నారా? తమకు అన్నీ తెలుసు అనుకుని తప్పులో కాలేస్తున్నారా? ఇలాంటి ప్రశ్నలకు తాజా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. పట్టభద్రులు, ఉపాధ్యాయులు.. వేల సంఖ్యలో చెల్లని ఓట్లు వేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చానీయాంశమైంది.
రెవెన్యూ శాఖపై సీఎం అంత సీరియస్సా?.. ఉద్యోగులు సమ్మె చేసేంత కీలక నిర్ణయమా?
చదువుకున్నోళ్లకే ఓట్లేయ్యరాలే..!
ఇటీవల ఒక పట్టభద్రుల, రెండు ఉపాధ్యాయ సెగ్మెంట్లకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు ఓటర్ల అవగాహనా రాహిత్యానికి నిదర్శనంగా నిలిచాయి. ఇక్కడ ఓటర్లంటే సామాన్యులు కాదు.. టీచర్లు, గ్రాడ్యుయేట్లు. ఓటు వినియోగంపై ప్రజలను చైతన్యవంతులను చేసేంతటి స్థాయి ఉన్నోళ్లు. అలాంటివారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకంగా 11 వేల 322 చెల్లని ఓట్లు వేయడం చర్చానీయాంశమైంది.
వేల ఓట్లు వృధా..!
మెదక్ - నిజామాబాద్ - కరీంనగర్ - ఆదిలాబాద్ టీచర్ సెగ్మెంట్ లో 23 వేల 214 ఓట్లుండగా 19 వేల 346 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వాటిలో 532 చెల్లని ఓట్లు పడ్డాయి. ఇక వరంగల్ - నల్గొండ - ఖమ్మం టీచర్ నియోజకవర్గంలో 20 వేల 888 ఓట్లుండగా 18 వేల 885 ఓట్లు పోలయ్యాయి. వాటిలో కూడా 858 చెల్లని ఓట్లు దర్శనమిచ్చాయి. అటు మెదక్ - నిజామాబాద్ - కరీంనగర్ - ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ సెగ్మెంట్ లో మొత్తం లక్ష 96 వేల 321 ఓట్లుండగా లక్ష 15 వేల 359 మంది ఓటేశారు. అందులో అత్యధికంగా 9 వేల 932 మంది ఓటు సరిగా వేయని కారణంగా వాటిని చెల్లనివిగా పరిగణించారు అధికారులు.
ఒక్క ఓటైనా కీలకమే..! నిరక్షరాస్యులు బెటరా?
ఒక్క ఓటుతో గెలుపోటములను ప్రభావితం చేసిన సందర్భాలున్నాయి. అలాంటిది వేల సంఖ్యలో ఓట్లు చెల్లుబాటు కాకపోవడం ప్రజాస్వామ్యంలో ఇబ్బందికరమైన పరిణామం. చదువుకున్న పట్టభద్రులు, ఉపాధ్యాయులే ఇలా ఓట్లు వేయడంలో తడబడితే ఇక సామాన్యుల పరిస్థితేంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈసారి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 11 వేలకు పైగా ఓట్లు చెల్లకపోవడమనేది అంతా తేలికగా తీసుకునే అంశం కాదు.
ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలనే దానిపై అటు ఎన్నికల అధికారులతో పాటు ఇటు అభ్యర్థులు కూడా బాగానే ప్రచారం చేశారు. అయితే అది చదివే తీరిక లేకనో.. మాకు తెలుసులే అనే నిర్లక్ష్యమో ఏమో గానీ మొత్తానికి వేల ఓట్లు పనికిరాకుండా పోవడం బాధాకరం. అయితే పెద్దగా చదువుకోని వారు, నిరక్షరాస్యులు సైతం ఓటు వినియోగంలో జాగ్రత్తగా ఉంటారు. అలాంటిది విద్యావంతులు ఇలా చెల్లని ఓట్లు వేయడమేంటనే పోస్టులు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.