అయ్యో పాపం: కళ్లు తెరిచి లోకంను చూడకుండానే.... నాలాలో మూడు నెలల పాప మృతదేహం
హైదరాబాదు: హైదరాబాదులో దారుణం వెలుగు చూసింది. ఈ ఘటన చూస్తే ఓ వైపు మనస్సు తరుక్కుపోతే మరోవైపు ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. ఆడపిల్లలంటే ఈ సమాజంకు ఎందుకు ఇంత చిన్న చూపని ఆగ్రహం వస్తుంది. చిన్నారులపై లైంగిక దాడులు జరుగుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. కొందరు తల్లిదండ్రులు ఆడపిల్ల పుట్టిందని ఎక్కడో వదిలేసి వెళ్లిపోతున్నారు. ఇలాంటి కథలు చదివినప్పుడు లేదా చూసినప్పుడు తల్లిదండ్రులపై ఎక్కడ లేని ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాదులోని చాంద్రయాణ గుట్టలో చోటుచేసుకుంది.
కళ్లు తెరిచి లోకం చూడకుండానే ఆ చిన్నారి కానరాని లోకాలకు వెళ్లిపోయింది. మూడంటే మూడే నెలల ఆ చిన్నారిని హతమార్చిన దుర్మార్గులు కాలువలో పడేశారు. అలా కొన్ని రోజుల పాటు కాలువలోనే చిక్కుకుని ఉన్న ఆ మృతదేహం శనివారం మధ్యాహ్నం హైదరాబాదులో కురిసిన భారీ వర్షానికి తేలుకుంటూ వచ్చింది. చాంద్రాయణగుట్ట గుల్షాన్ ఇక్బాల్ కాలనీలో తేలుతూ కనపడింది.
హైదరాబాద్ చాంద్రాయణగుట్టలో ఆదివారం రోజు రాత్రి ఓ మూడు నెలల చిన్నారి మృతదేహం నాలాలో కొట్టుకురావడం కలకలం రేపింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాలాలో ఏదో వస్తువు కొట్టుకువచ్చిందని భావించిన గుల్షాన్ ఇక్బాల్ కాలనీ స్థానికులు దగ్గరకు వెళ్లి చూడగా షాక్ అయ్యారు. అది వస్తువుకాదని మూడు నెలల చిన్నారి మృతదేహం అని గుర్తించారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నాలాలో ఉన్న చిన్నారి మృతదేహాన్ని బయటకు తీసి ఉస్మానియా హాస్పిటల్కు పోస్టుమార్టంకు తరలించారు.
చిన్నారి మృతదేహం కుల్లిన స్థితిలో ఉన్నిందని చెప్పిన పోలీసులు కొన్ని రోజుల క్రితమే చిన్నారిని ఎవరో కాలువలో పడేసి ఉంటారన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే అక్రమసంబంధం ద్వారా పుట్టిన బిడ్డను వదిలించుకోవాలనే ఉద్దేశంతోనే ఎవరో ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. బిడ్డ ఇంట్లోనే జన్మించి ఉండొచ్చని ఈ మధ్యకాలంలో ఎవరైనా గర్భవతులు బిడ్డకు జన్మనిచ్చారా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. త్వరలోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డ వారిని పట్టుకుంటామని పోలీసులు చెప్పారు.