ఒకే సిగరెట్ తాగారు! ఆ ముగ్గురూ కరోనా బారినపడ్డారు!!
హైదరాబాద్: లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లాలో విచిత్రమైన పరిస్థితుల్లో ముగ్గురికి కరోనా సోకింది. ఒక సిగరెట్ను ముగ్గురూ కాల్చడంతో అందులో ఒకరికి కరోనా ఉండటంతో మిగితా ఇద్దరికీ సోకింది.
చైనాకు రిలీఫ్-ట్రంప్కు షాక్: కరోనావైరస్ సృష్టిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పిందంటే..?
వివరాల్లోకి వెళితే.. షాద్నగర్కు చెందిన ఓ యువకుడు హైదరాబాద్ జియాగూడలో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి అంత్యక్రియలకు వెళ్లాడు. అక్కడ ఆ కార్యక్రమాన్ని ముగించుకుని తిరిగి షాద్ నగర్ చేరుకున్నాడు. అక్కడ తన ఇద్దరు స్నేహితులతో కలిసి సిగరెట్ తాగాడు.
ఒక సిగరెట్నే ముగ్గురూ కలిసి తాగారు. ఆ తర్వాత వారంతా అనారోగ్యానికి గురవడంతో పరీక్షలు చేస్తే ఆ ముగ్గురికీ కూడా కరోనా సోకినట్లు తేలింది. ఆ ముగ్గురికీ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. జియాగూడకు వెళ్లివచ్చి వ్యక్తికి కరోనా ఉండటంతో ఇతరులకు వచ్చిందని అధికారులు తేల్చారు. కరోనా బాధితుడు కలిసిన వ్యక్తులకు కూడా పరీక్షలు చేసే పనిలో పడ్డారు.
కాగా, తాజాగా మూడు కేసులు నమోదు కావడంతో మొత్తం షాద్నగర్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏడుకు చేరింది. ఒక్కసారిగా మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో స్థానికంగా ఆందోళనకర వాతావరణం నెలకొంది. అధికారులు పారిశుధ్య కార్యక్రమాలు మరింతగా పెంచారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
తెలంగాణలో ఇప్పటి వరకు 2098 కేసులు నమోదు కాగా, 63 మరణాలు సంభవించాయి. 1321 మంది కోలుకోగా, 714 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.