పాతబస్తీలో దారుణం: మూడేళ్ల బాలుడిని భవనంపైనుంచి విసిరేసింది, పిల్లలులేరనే..
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భవానీనగర్లో మూడేళ్ల బాలుడిని అతని పిన్ని భవనంపై నుంచి కిందకు తోసేసింది. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈది బజార్లోని కుమ్మరివాడలో అహ్మద్ ఉద్దీన్ అనే వ్యక్తికి ఐష అనే మహిళతో ఏడాది క్రితం వివాహం జరిగింది. భర్త సోదరుడు మహ్మద్ ఎతేశ్యామ్ కుమారుడు నామానుద్దీన్ తరచూ వీరి ఇంటికి వెళ్తుండేవాడు. కాగా, మంగళవారం ఉదయం కూడా ఇంటికి వచ్చిన నామాన్ను భవనంపైకి తీసుకెళ్లిన ఐష.. రెండు అంతస్తుల పైనుంచి కిందకి తోసేసింది. దీంతో బాలుడు తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితురాలు ఐషను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను విచారించగా.. నామనుద్దీన్ను తానే భవనంపైనుంచి కిందికి విసిరేసినట్లు పోలీసుల ముందు అంగీకరించింది. వివాహం జరిగి ఏడాది అవుతున్నా.. తనకు పిల్లలు పుట్టనందునే ఈ దారుణానికి పాల్పడినట్లు కుటుంబసభ్యులో ఆరోపించారు. ఐషను అరెస్ట్ చేసిన పోలీసులు, కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
యువతిపై ప్రేమోన్మాది దాడి
హైదరాబాద్ నగర శివారు నార్సింగి పరిధి హైదర్షాకోట్లో దారుణం జరిగింది. ఓ యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. తీవ్రగాయాలపాలైన యువతిని ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.