హైదరాబాద్ వాసులకు IMD హెచ్చరిక.. పిడుగులు పడే ఛాన్స్..! జాగ్రత్తగా ఉండాలంటూ..!!
హైదరాబాద్ : ఇటీవల కురుస్తున్న వర్షాలతో భాగ్యనగరం తడిసి ముద్దవుతోంది. ఉదయం ఒక తీరుగా ఉంటున్న వాతావరణం మధ్యాహ్నం, సాయంత్రం కల్లా మారిపోతోంది. ఈ నేపథ్యంలో బుధవారం (09.10.2019) నాడు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. అయితే హైదరాబాద్లో వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. నగరవాసులు అవసరమైతే తప్ప ఇంటి నుంచి కానీ, ఆఫీసుల నుంచి కానీ బయటకు రావొద్దని సూచించారు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్.
బుధవారం నాడు కురిసిన వర్షంతో బంజారాహిల్స్ పరిసర ప్రాంతాలు వాగులను తలపించాయి. కుండపోతగా వర్షం పడటంతో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. అయితే పిడుగులు పడే ఛాన్సుందని భారత వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన దరిమిలా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులు అలర్ట్ అయ్యారు. నగర వాసులు జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు.
పోలీస్ అధికారి తలపై కోతి.. నువ్వు కేసులు చూస్కో.. నేను పేలు తీస్తా..! (వీడియో)
మరోవైపు వరద నీటి కారణంగా తలెత్తే సమస్యలను నివారించేందుకు కృషి చేస్తున్నారు. వర్షాల కారణంగా ఏర్పడే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మాన్సూన్ బృందాలను.. డిజాస్టర్ రెస్క్యూ బృందాలను సిద్దం చేసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ తెలిపారు. ఈ రెండు బృందాలకు సంబంధించిన సిబ్బంది క్షేత్ర స్థాయిలో అలర్ట్గా ఉన్నారని చెప్పారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తున్నామని వెల్లడించారు.
ఇటీవల కురుస్తున్న వర్షాలతో నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. వరద నీరు నిలిచిన చోట మ్యాన్ హోల్స్ తెరిచే ప్రయత్నాలు చేయొద్దని సూచించారు. ఏవైనా ఇబ్బందులుంటే జీహెచ్ఎంసీ సిబ్బందికి గానీ, అధికారులకు గానీ ఫిర్యాదు చేయాలని కోరారు. పిడుగులు పడే ఛాన్సుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లకు దూరంగా ఉండాలని కోరారు.