సినీ తారల డ్రగ్స్ కేసులో ఊహించని ట్విస్ట్..ఆర్టీఐ ఎంక్వైరీలో సంచలన విషయాలు..దీనిపై సీఎస్కు ఫిర్యాదు
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన 'టాలీవుడ్ సినీ తారల డ్రగ్స్ కేసు'లో ఊహించని ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. హీరో రవితేజ, దర్శకుడు పూరీ జగన్నాథ్, నటి ఛార్మి, ముమైత్ ఖాన్, నవదీప్, సుబ్బరాజు, తరుణ్, తనీష్ సహా డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సినీ తారల పేర్లు చార్జిషీట్లలో లేకపోవడం సంచలనంగా మారింది. చాలా రోజుల కిందటే ప్రాధాన్యం కోల్పోయిన ఈ కేసు విచారణ ఎంతదాకా వచ్చిందనేదానిపై 'ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్' సంస్థ.. సమాచార హక్కు చట్టం కింద ప్రశ్నలు సంధించగా, షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.
ముందు క్లీన్ చిట్.. ఇప్పుడు పేర్లు క్లీన్..
రెండేండ్ల కిందట వెలుగుచూసిన టాలీవుడ్ సినీ తారల డ్రగ్స్ కేసును అప్పటి ఎక్సైజ్ శాఖ కమిషనర్ అకున్ సభర్వాల్ నేతృత్వంలోని సిట్ ఎంక్వైరీ చేయడం, ఏకంగా 11 రోజులపాటు 62 మందిని రకరకాలుగా ప్రశ్నించడం.. దీనికి సంబంధించిన 12 కేసుల్లో4ఛార్జిషీట్లు దాఖలు కావడం తెలిసిందే. ఈ కేసుతో సంబంధమున్న పలువురు సెలబ్రిటీలకు క్లీన్చిట్ దక్కడం వివాదాస్పదమైంది. సెలబ్రిటీలందరూ బాధితులేతప్ప నిందితులు కాదని తేల్చిచెప్పిన పోలీసులు.. కనీసం వాళ్ల పేర్లను చార్జి షీట్లలో ప్రస్తావించకపోవడం చర్చనీయాంశమైంది.
హడావుడి చేసినా..
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పేరుపొందిన కెల్విన్ ను, మరో ఇద్దరి అరెస్టుతో టాలీవుడ్ తారల పేర్లన్నీ బయటపడ్డాయి. నెల రోజులపాటు విచారణలు జరిపిన సిట్.. ప్రముఖుల వెంట్రుకలు, గోర్లు తదితర ఆనవాళ్లను సేకరించింది. ఒక దశలో నిందితులకు కఠిన శిక్షలు తప్పవని కూడా సిట్ హెచ్చరించింది. తీరా చూస్తే చార్జి షీలులో మాత్రం సెలబ్రిటీల పేర్లను కూడా ప్రస్తావించలేదు.
తప్పుడు ఎంక్వైరీపై ఫిర్యాదు..
కాగా, టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించిన వివరాలను ఆర్టీఐ ద్వారా సేకరించిన ‘ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్' వ్యవస్థాపకుడు పద్మనాభరెడ్డి.. ఈ కేసులో ఎంక్వైరీ జరిగిన తీరుపై అనుమానాలు వ్యక్తం చేశారు. నిందితులను బాధితులుగా పేర్కొనడాన్ని, చార్జి షీటులో సెలబ్రిటీల పేర్లు చేర్చకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. కేసును తప్పుగా ఎంక్వైరీ చేసిన తీరుపై తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ కు ఫిర్యాదు చేసినట్లు పద్మనాభరెడ్డి తెలిపారు.