పోలీసులు కాపాడకుంటే నా గతి ఏమయ్యేదో: దాడి ఘటనపై కత్తి మహేశ్
ప్రముఖ సినీ క్రిటిక్, దర్శకుడు, నటుడు కత్తి మహేశ్ పై శుక్రవారం హైదరాబాద్ లో దాడి జరిగింది. ప్రసాద్ ఐమాక్స్ లో విజయ్ దేవరకొండ నటించిన 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా చూసి వెళుతోన్న సమయంలో కత్తిని చుట్టుముట్టిన దుండగులు.. ఆయన కారు అద్దాలను ధ్వంసం చేశారు. గొడవ జరుగుతున్నట్లు గుర్తించిన పోలీసులు అక్కడికెళ్లి గుంపును చెదరగొట్టారు. ఈ ఘటనపై మహేశ్ 'వన్ ఇండియా'తో మాట్లాడారు.
పథకం ప్రకారమే..
రెండ్రోజుల కిందట ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ఓ సాహితీ సభలో కత్తి మహేశ్ మాట్లాడుతూ శ్రీరాముడిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం, పలు హిందూ సంఘాలు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేయడం, ‘కత్తి కనిపిస్తే ఖతం చేస్తాం..'అంటూ భజరంగ్ దళ్ లాంటి సంస్థలు హెచ్చరికలు చేయడం తెలిసిందే. శుక్రవారం సినిమా చూసేందుకు మహేశ్ ఐమాక్స్ కు వచ్చారన్న సంగత తెలిసిన వెంటనే దుండగులు దాడికి పథకం వేశారని, ఆయన బయటికొచ్చేదాకా ఎదురుచూసిమరీ దెబ్బకొట్టే ప్రయత్నం చేశారని పోలీసులు తెలిపారు.
వాళ్లపనేనా?
కత్తి మహేశ్ పై దాడికి సంబంధించి ముగ్గురు వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఆ ముగ్గురూ భజరంగ్ దళ్ కార్యకర్తలేనా? కాదా? అనేది నిర్ధారణ కావాల్సి ఉంది. ప్రతి శుక్రవారం కొత్త సినిమాల విడుదల సందర్భంగా ఐమాక్స్ దగ్గర రద్దీ దృష్యా పోలీసులు అదనంగా సిబ్బందిని కొనసాగిస్తారు. ఆ పోలీసులే తన ప్రాణాలు కాపాడారని కత్తి మహేశ్ చెప్పారు.
చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడమేంటి?
‘‘దేవుణ్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసినందుకు నా మీద కేసులు పెట్టారు. నేను మాట్లాడింది తప్పయితే చట్టం కచ్చితంగా శిక్షిస్తుంది. కానీ ఎవరికివాళ్లు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దాడులు చేయడం కరెక్ట్ కాదు. ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీసులకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. సమయానికి పోలీసులే గనుక కాపాడకపోయిుంటే నా పరిస్థితి ఏమై ఉండేదో చెప్పలేను''అని మహేశ్ అన్నారు.
శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు..
రెండ్రోజుల కిందట ఓయూలో జరిగిన ఓ సాహితీ సభకు అతిథిగా హాజరైన కత్తి మహేశ్ హిందువుల ఆరాధ్యదైవం శ్రీరాముణ్ని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. రాముడు ఏకపత్నీవ్రతుడు కాడని, అంత:పురంలో చాలా మంది చెలికత్తెలుండేవారని, నెమలి మాంసం, జింక తొడను ఆయన ఇష్టంగా తినేవాడని కత్తి మహేశ్ అన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వాటిపై పోలీసులు విచారణ చేస్తుండగానే కత్తిపై దాడి జరగడం సంచలనం రేపింది. గతంలో పవన్ కల్యాణ్ ను విమర్శించిన కారణంగానూ మహేశ్ దాడికి గురయ్యారు.