తొర్రూరులో ఆర్టీసీ మెకానిక్ ఆత్మహత్యా యత్నం .. పరిస్థితి విషమం
ఆర్టీసి సమ్మె నేపద్యంలో ఇప్పటికే పదుల సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు మృత్యువాత పడ్డారు. అనారోగ్యంతో కొందరు, ఆత్మహత్యలకు పాల్పడుతూ మరికొందరు ఆర్టీసీ కార్మికులు మరణిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం ఏ మాత్రం తనకు సంబంధం లేనట్టు ప్రవర్తిస్తుంది.
ఆర్టీసీ కార్మికుల విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ మార్చుకోమని తేల్చి చెబుతోంది. ఇక హైకోర్టులో ఆర్టీసీ కార్మికులు తమకు న్యాయం జరుగుతుందని ఆశగా ఎదురు చూస్తున్న, కోర్టులో మాత్రం వాయిదాల పర్వం కొనసాగుతోంది. కోర్టు ఆర్టీసీ కార్మికుల విషయంలో ప్రభుత్వ వైఖరిపై చట్టానికి లోబడి మాత్రమే పని చేయగలమని చెప్పటంతో ఆర్టీసీ కార్మికులు నీరుగారిపోయారు. తమకోసం ఎవరూ ఏమీ చెయ్యలేరా అన్న ఆవేదనలో ఉన్నారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందుతున్న ఆర్టీసీ కార్మికులు ఒక్కొక్కరు ఆత్మహత్యల బాట పడుతున్నారు .
మూడు నెలలుగా జీతాలు లేక, ఉద్యోగం పోయినట్టే అని ప్రభుత్వం చెప్పటంతో ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఆవేదనతో ఉన్నారు. ఇక ఆర్టీసీ కార్మిక కుటుంబాలు దయనీయమైన పరిస్థితుల్లో కాలం వెళ్లదీస్తున్నారు. ఈ పరిస్థితుల్లోనే తొర్రూరు ఆర్టీసీ డిపో ( శ్రామిక్ ) మెకానిక్ గా పనిచేస్తున్న మేకల అశోక్ అనే ఆర్టీసీ కార్మికుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మేకల అశోకు స్వస్థలం తొర్రూరు మండలం సోమారం గ్రామం. ఆర్టీసీ సమ్మె 41 రోజులుగా కొనసాగుతున్న తమ సమస్యకు పరిష్కారం దొరకలేదని తీవ్ర మనస్తాపానికి గురైన పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా కలకలం రేపింది . దీంతో అశోక్ ను స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అశోక్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.