తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి కాదా.. కుంతియా ఏమన్నారంటే..!
హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించడానికి.. కాంగ్రెస్కు ప్రాణం పోసేలా ఆ పార్టీకి చెందిన ఢిల్లీ పెద్దలు పెద్ద స్కెచ్ వేశారనే ప్రచారం ఇటీవల జోరందుకుంది. ఆ క్రమంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డిని నియమించే అవకాశాలు ఉన్నట్లు వైరల్ అయింది.
టీడీపీ నుంచి కాంగ్రెస్ గూటికి చేరిన రేవంత్ రెడ్డి మొన్నటి ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నేతలను ఉతికి ఆరేయడంలో బాగా యాక్టివ్ రోల్ పోషించారని.. అదే క్రమంలో ఆయనకు టీపీసీసీ పగ్గాలు అప్పగిస్తే కాంగ్రెస్కు పునర్ వైభవం వస్తుందనేది ఆ పార్టీ హైకమాండ్ ఆలోచన అంటూ ఇటీవల టాక్ నడుస్తోంది.
తెలంగాణలో యూరియా లొల్లి.. టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్.. మధ్యలో బీజేపీ..!
ఒకవేళ రేవంత్ రెడ్డికి తెలంగాణ పీసీసీ పగ్గాలు అప్పజెప్పితే.. సముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు ఊరుకుంటారా అనేది పెద్ద ప్రశ్న. ఎంతోమంది ఉద్దండులు ఉన్న కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి మంత్రం పనిచేస్తుందా అనేది మరో కోణం. అయితే టీపీసీసీ పగ్గాలు రేవంత్ రెడ్డికే అన్న ప్రచారం జోరందుకున్న ఈ సమయంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంతియా స్పందించారు. టీపీసీసీ చీఫ్ మార్పుపై ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. అసలు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి విషయంలో పార్టీలో చర్చ జరగలేదన్నారు.
పనిలో పనిగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణాస్త్రాలు సంధించారు కుంతియా. టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. భూ కుంభకోణాలతో పాటు విద్యుత్, ఇరిగేషన్ శాఖల్లో జరిగిన అక్రమాలను వెలికి తీసేందుకు కాంగ్రెస్ పార్టీ తరపున కమిటీ వేస్తామన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించే లక్ష్యంలో ముందుకెళతామని తెలిపారు. ఈ నెల రెండో వారం నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభిస్తామని చెప్పుకొచ్చారు.