600 జడ్పీటీసీల్లో 6 గెలవలేదు.. కాంగ్రెస్ను విమర్శిస్తారా.. బీజేపీపై పొన్నం విసుర్లు..!
హైదరాబాద్ : ఇటీవల బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ చందంగా నేతల మాటల యుద్దం పీక్ స్టేజీకి చేరుతోంది. కాంగ్రెస్కు జబ్బు చేసినట్లు ఐసీయూలో ఉందని.. ఇక గాంధీ భవన్కు టులెట్ బోర్డు పెట్టుకోవాల్సిందేనని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దానికి తగ్గట్లుగా కాంగ్రెస్ నేతలు కూడా కౌంటర్ ఇస్తున్నారు. ఆ క్రమంలో బీజేపీ నేతలపై ఓ రేంజ్లో మండిపడ్డారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్.
లక్ష్మణ్ వ్యాఖ్యలను తీవ్ర స్థాయిలో ఖండించిన పొన్నం.. బీజేపీ మీద అభిమానంతో ప్రజలు మొన్నటి లోక్సభ ఎన్నికల్లో నాలుగు స్థానాలు కట్టబెట్టలేదని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ మాజీ ఎంపీలు కవిత, వినోద్ కుమార్ను ఓడించాలనే లక్ష్యంతో నిజామాబాద్, కరీంనగర్లో బీజేపీకి పట్టం కట్టారని చెప్పుకొచ్చారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి తాళం వేసే రోజులు వస్తాయని జోస్యం చెప్పారు.
బీజేపీ గూటికి ఏపీ నేతలు.. గంగుల సహా మరికొందరు.. జేపీ నడ్డాతో భేటీ
కొత్త బిచ్చగాళ్లు పొద్దు ఎరగరు అన్న మాదిరిగా బీజేపీ నేతలు మాట్లాడటం దేనికి సంకేతమని ఎద్దేవా చేశారు. ఐదేళ్లు అధికారంలో ఉండి తెలంగాణకు ఏమి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో 105 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిన బీజేపీ నేతలు ఇప్పుడు నీతులు చెప్తున్నారని చురకలంటించారు.
600 జడ్పీటీసీల్లో కనీసం 6 స్థానాలు కూడా గెలుచుకోలేనోళ్లు ఇవాళ కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ కనుసన్నల్లోనే తెలంగాణ బీజేపీ శాఖ పనిచేస్తోందని.. ఆ రెండు పార్టీలు దొందూ దొందేని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేసీఆర్తో దోస్తీ లేకుంటే.. ముందస్తు ఎన్నికలను ఎందుకు ప్రశ్నించలేదని ఫైరయ్యారు.