ఓటుకు నోటు కేసు: రేపు ఈడీ ముందుకు రేవంత్ రెడ్డి, ఏం చెబుతారు?
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మంగళవారం (ఫిబ్రవరి 19వ తేదీ) ఓటుకు నోటు కేసులో ఈడీ (ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్) ఎదుట హాజరు కానున్నారు. ఈ మేరకు ఆయనకు ఈఢీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. గత వారం ఈ కేసుకు సంబంధించి వేం నరేందర్ రెడ్డి, ఆయన తనయులను ఈడీ విచారించింది.
రేవంత్ రెడ్డితో పాటు ఉదయ్ సిన్హాను కూడా ఈడీ విచారించనుంది. వీరిద్దరిని ఇప్పటికే ఈడీ విచారించింది. ఇప్పుడు మంగళవారం రేవంత్ను మరోసారి విచారించనుంది.
2015లో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నాడు తెలుగుదేశం పార్టీ కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి రూ.50 లక్షలతో పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరుతూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ.5 కోట్లు ఇవ్వజూపారని, అందులో రూ.50 లక్షలతో రేవంత్ పట్టుబడినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. దీనిపై విచారణ సాగుతోంది. విచారణలో, విచారణ అనంతరం రేవంత్ రెడ్డి ఏం చెబుతారనేది ఆసక్తికరంగా మారింది.
కాగా, వారం క్రితం వేం నరేందర్ రెడ్డి, ఆయన తనయులను ఈడీ విచారించింది. విచారణ అనంతరం ఆయన వేం మాట్లాడారు. ఈ కేసుకు సంబంధించి తనతో పాటు తన ఇద్దరు కొడుకులకు కూడా విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు జారీ చేసిందని వేం చెప్పారు.
ఈ కేసుతో సంబంధం లేని తన కుమారులను పిలవడం బాధాకరమన్నారు. అలాగే, రేవంత్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేసినట్లుగా సమాచారం ఉందని తెలిపారు. మరో వారం రోజుల్లో విచారణకు హాజరు కావాలని ఆయనకు (రేవంత్ రెడ్డి) సూచించినట్లుగా తెలిసిందన్నారు.