తెలంగాణ ఫలితాలపై కాంగ్రెస్ ధీమా.. ఢిల్లీ ఫ్లైటెక్కిన ఉత్తమ్
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎన్నడూలేని విధంగా ఈ ఎన్నికల ఫలితాలపై అంచనాలు పెరిగాయి. తెలంగాణ పీఠం కారుకా లేదంటే హస్తానికా? ఎవరిని కదిలించినా ఇదే టాపిక్. క్యాంటిన్లు, కార్యాలయాలు, పార్కులు, టీ కొట్లు, టిఫిన్ సెంటర్లు ఇలా ఎక్కడ చూసినా అదే చర్చ. అదలావుంటే ఫలితాలకు ఇంకా ఒక్కరోజే మిగిలిఉండటంతో ఆయా పార్టీల నేతలు వ్యూహరచనలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంలో ఎవరికివారే స్కెచ్చులేస్తున్నారు. ఈనేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ ఫ్లైటెక్కడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలంగాణ అసెంబ్లీ ఫలితాల తర్వాత చోటుచేసుకోనున్న పరిణామాలపై చర్చించేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు. ఫలితాలు, ఎగ్జిట్ పోల్స్, కూటమి అభ్యర్థుల విన్నింగ్ ఛాన్స్ తదితర అంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కాంగ్రెస్ కు ఫుల్ మెజార్టీ వస్తే ఏవిధంగా వ్యవహరించాలి? కూటమితో జతకట్టిన పార్టీలన్నీ కలుపుకొని గవర్నమెంట్ ఏర్పాటు చేయబోతే ఏం చేయాలి? ఫలితాలు మహాకూటమికి అనుకూలంగా ఉంటే గవర్నర్ ను ఎప్పుడు కలవాలి? తదితర అంశాలు వీరి భేటీలో ముఖ్యాంశాలు కానున్నాయి. రాహుల్ గాంధీతో భేటీ అనంతరం వెంటనే హైదరాబాద్ కు తిరుగు పయనం కానున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.